నాగర్కర్నూల్, మే 18 (నమస్తే తెలంగాణ) : ఉమామహేశ్వర లిఫ్ట్ పట్టాలెక్కనుంది. ఈనెల మొదటి వారంలో రూ.1,534కోట్లతో ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు మంజూరు కాగా, రెండు వారాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లిఫ్ట్ పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. దీంతో రాబోయే కాలంలో అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతుంది.
అచ్చంపేట నియోజకవర్గాన్ని కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లిఫ్టు ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా నియోజకవర్గంలోని 72వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుంది. దీనికోసం రూ.1534కోట్లను మంజూరు చేసింది. ఈ లిఫ్ట్ట్లో భాగంగా బల్మూర్ మండలంలో ఉమామహేశ్వర లిఫ్ట్ను నిర్మించనున్నారు. అక్కడి నుంచి ఫేజ్-2 ద్వారా అమ్రాబాద్, పదర ప్రాంతాలకు సైతం సాగునీరు అందనుంది. ఈ రెండు మండలాల్లో దాదాపుగా 15వేల ఎకరాలకు సాగునీరు తరలి రానుంది. ప్రస్తుతం ఎంజీకేఎల్ఐ ద్వారా నియోజకవర్గంలో కేవలం 3వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. దీంతో మిగిలిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇంతకు ముందు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించిన సీఎం లిఫ్టు నిర్మాణానికి ఆమోదించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి దాదాపుగా 25కిలో మీటర్ల పొడవైనాన కాల్వ ద్వారా 2.6టీఎంసీల నీటిని ఉమామహేశ్వర లిఫ్ట్నకు తరలిస్తారు. ఇక్కడి నుంచి నీళ్లను లిఫ్ట్ ద్వారా ఆయకట్టుకు ఎత్తిపోయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నల్లమల ఎత్తైన అమ్రాబాద్, పదర మండలాలకు సైతం సాగునీరు అందించేలా ఈ బృహత్ పథకానికి అనుమతించడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ఇప్పటికే ఎంజీకేఎల్ఐతో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, ఈ రిజర్వాయర్తో పాటు బిజినేపల్లి మండలంలోని మార్కండేయ రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో కృష్ణమ్మ జలసవ్వడి చేయనున్నది.
అచ్చంపేట ప్రజల చిరకాలవాంఛను నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉం టాం. ఉమామహేశ్వర లిఫ్ట్ ఫేజ్-1, ఫేజ్-2తో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. రూ.1,534కోట్ల నిధులు మంజూరు చేయడం, కేబినెట్ తీర్మానం చే యడం హర్షణీయం. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేపడతాం.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే