వనపర్తి, మార్చి 5 : వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ మరింత పరుగులు పెట్టనున్నది. సాగునీటి జలాలను ఒడిసిపట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఖిల్లాఘణపురం గణప సముద్రాన్ని, గోపాల్పేట బుద్ధారం చెరువును రిజర్వాయర్లుగా మార్చాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా గణప సముద్రానికి రూ.55 కోట్లు, బుద్ధారం చెరువుకు రూ.42.2 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. గణప సముద్రం కింద 10 వేల ఎకరాలు సాగులోకి రానుండగా.. బుద్ధారం చెరువు కింద 31,038 ఎకరాలు సాగుకానున్నాయి. ఈ రెండు చెరువులు రిజర్వాయర్లుగా మారితే రాబోయే రోజుల్లో సాగునీటికి ఢోకా ఉండదని రైతులుసంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తానని మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కాగా 36 ఏండ్ల తర్వాత కృష్ణా నీటితో గణప సముద్రాన్ని నింపగా.. నిండు వేసవిలో సైతం అలుగు పారుతున్నది.
గతంలో చుక్క నీటి కోసం తల్లడిల్లారు.. ఎప్పటికైనా తమ బతుకులు మారవా అని దేవుడిని వేడుకోని రోజంటూ లేదు.. కానీ, సమైక్య రాష్ట్రం లో పాలకులు పట్టించుకోకపోవడంతో కలగానే మిగిలింది.. దీంతో పంటపొలాలు సాగునీరు లేక బీటలుగా మారాయి.. ఎంజీకేఎల్ఐ పథకంలో ఖిల్లాఘణపురం మండలం లేకపోవడంతో ఆశలు అడియాశలయ్యాయి..
అయితే, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ ప్రాంత రూపురేఖలు మారాయి. వం దల ఏండ్ల చరిత్ర కలిగిన గణపసముద్రానికి నీళ్లు తీసుకురావాలని మొక్కవోని దీక్ష పూనారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ఈ ప్రాంత ప్రజల కష్టాలను వివరించి 20 టీఎంసీలు ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతలను 40 టీఎంసీలకు పెంచారు. మంగనూర్ మీదుగా ఖిల్లాఘణపరం గణపసముద్రానికి నీళ్లు తీసుకొచ్చారు. దీంతో 36 ఏండ్ల తరువాత (2018 మార్చిలో) తొలిసారిగా అలుగుపారింది.
దాదాపు 700 ఏండ్ల కిందట గణపసముద్రం చెరువును గోనగన్నారెడ్డి నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరువు ప్రాభవాన్ని కోల్పోయింది. వర్షాధారంపైన ఉన్న ఈ చెరువులో నీళ్లులేక పొలాలు బీళ్లుగా ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది రైతులు ముందడుగేసి దాదాపు 300 ఫీట్లు బోర్లు వేసినా ధారలాగా నీళ్లు పడేవి. దీంతో ఈ ప్రాంత రైతులు వలస బాటపట్టారు. ఎంతలా అంటే ఖిల్లా నుంచి బొంబాయికి ప్రత్యేకంగా బస్సు ఉండేది. నిరంజన్రెడ్డి కృషి ఫలితంగా గణపసముద్రం నేడు మండువేసవిలో సైతం నిండుకుండను తలపిస్తున్నది. దీంతో వలసలు నిలిచిపోయాయి. గణపసముద్రాన్ని ఆదర్శంగా తీసుకున్న వనపర్తి సంస్థానాధీశులు వనపర్తి చుట్టూ సప్తసముద్రాలను నిర్మించారు.
నిధుల వెల్లువ..
గణపసముద్రం పునరుద్ధరణకు రూ.55 కోట్లు, బుద్ధారం చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు రూ.42.2 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదివారం జీవో విడుదల చేసింది. ఈ పనులు పూ ర్తయితే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరం గా మారనున్నది. గణపసముద్రం కింద దాదాపు 10 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. బుద్ధారం ఎడమ, కుడి కాలువల కింద 31,038 ఎకరాల ఆ యకట్టు ఉన్నది. గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆ లయానికి గణపసముద్రం కిరీటంలా నిలువనున్నది.
చరిత్రలో నిలిచిపోయేలా పనులు..
సీఎం కేసీఆర్ చొరవతో గణపసముద్రానికి మరమ్మతులు చేయించి.. ఎంజీకేఎల్ఐ కాలువకు అనుసంధానం చే శాం. దీంతో 36 ఏండ్ల తరువాత కృష్ణానది నీటితో అలుగు పారింది. ఐదేండ్లు గా గణపసముద్రం నిండుకుండను తలపిస్తున్నది. గణపసముద్రం పునరుద్ధర ణ, బుద్ధారం రిజర్వాయర్ పనులు ఏకకాలంలో చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. చరిత్రలో నిలిచిపోయేలా పనులు చేస్తాం. గణపసముద్రాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దడంతోపాటు మరో 500 ఏండ్ల వరకు బహుళార్థకంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి