మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భక్తులు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణ మార్మోగింది. పలువురు ఉపవాసదీక్ష చేపట్టి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శివపార్వతుల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.