పెబ్బేరు, ఫిబ్రవరి 25: ఆరోగ్య తెలంగాణే లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దవాఖానల్లో మెరుగైన సేవలందించడంలో సఫలమై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వం.. పలు వ్యాధులకు నిత్యం వాడే మందులను కిట్ల రూపంలో అందించేందుకు సిద్ధమైనది. ‘ఎన్సీడీ మందుల కిట్’ పేరిట బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా మందులు పంపిణీ చేసేందుకు గానూ కిట్లను రూపొందించింది. వీటిని ఇప్పటికే అన్ని దవాఖానలకు సరఫరా చేసి రోగులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాకు కూడా ఇటీవల ఎన్సీడీ కిట్లు చేరాయి. ‘నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్’ అంటే అసంక్రమిక వ్యాధుల నివారణ, అదుపునకుగానూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహాన్ని దృష్టిలో పెట్టుకొని కిట్లను రూపొందించింది. బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, పక్షవాతం, కంటిచూపు మందగించ డం, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు గురవ్వడం, రక్తనాళాలు దెబ్బతినడం, పాదాలకు పుండ్లు ఏర్పడ టం వంటి దుష్పరిణామాల బారిన పడే అవకాశముందని, మందులను క్రమం తప్పకుండా వా డాలని సూచిస్తూ ప్రభుత్వం ఈ కిట్లను తయారు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎంత మంది బీపీ, షుగర్ రోగులున్నారో అధికార యంత్రాం గం గుర్తించింది. మొత్తం బీపీ రోగులు 34వేల 829మంది, షుగర్ రోగులు 18వేల 348మంది ఉన్నట్లు నిర్ధారించారు. కొందరికి బీపీ, షుగర్ రెండు వ్యాధులు ఉంటున్నందున మొత్తంగా బీపీ, షుగర్ రోగుల సంఖ్య జిల్లాలో 35,518కాగా, అందరికీ ఈ కిట్లు మంజూరయ్యాయి.
మందులు సురక్షితంగా ఉండేందుకే..
ఏ మందైనా వాడే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రెగ్యులర్గా వాడే మందులను చాలామంది నిర్లక్ష్యంగా ఇంట్లో ఉంచుతుంటారు. నియమిత ఉష్ణోగ్రత, గాలి, వెలుతురు, కీటకాల నుంచి రక్షణ, సులభంగా తీసుకెళ్లేందుకు వీలుగా ఉండేందుకే మందులు ఉంచుకొనేందుకు చేతి సైజు బ్యాగులను రూపొందించారు. ఈ బ్యాగుల్లోనే బీపీ, షుగుర్ మందులను పెట్టుకొని వాడుకోవాల్సి ఉంటుంది.
దవాఖానల వారీగా రోగుల సంఖ్య
అప్పరాలలో 1,315, ఘణపురంలో 2,045, గోపాల్పేటలో 4,232, కడుకుంట్లలో 1,453, కమాలుద్దీన్పూర్లో 958, కొత్తకోటలో 2,378, మదనాపురంలో 1,605, పాన్గల్లో 3,195, పెబ్బేరులో 4,849, పెద్దమందడిలో 2,954, తిప్డంపల్లిలో 2,215, వీపనగండ్లలో 3,073, వనపర్తిలో 2,326, వనపర్తి పట్టణంలోని గాంధీనగర్లో 1,626, పీర్లగుట్టలో 1,294మంది రోగులు ప్రభుత్వ మందులపై ఆధారపడి ఉన్నారు. వీరందరికీ కిట్ల రూపంలో బీపీ, షుగర్ ట్యాబ్లెట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
రోగులకు పంపిణీ చేసేందుకు సిద్ధం
జిల్లాకు సరఫరా అయిన ఎన్సీడీ కిట్లను అన్ని దవాఖానలకు పంపిణీ చేశాం. ఇక వాటిని రోగులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులతో పంపిణీ చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నది. అందుకే నేరుగా రోగులకు మందులను పంపిణీ చేయాలని ఆదేశించాం. ప్రభుత్వ దవాఖానల్లో మందులు వాడే వారిని మాత్రమే గుర్తించి అందరికీ పంపిణీ చేస్తాం. మందులు వాడటంలో రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ బ్యాగులను అందిస్తోంది.
– డాక్టర్ రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి జిల్లా