వనపర్తి, సెప్టెంబర్ 24 : ప్రజలు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదన్నారు. యాదవులు గొర్రెలు పెంచడం, మేకలు కాయడం తప్పు కాదని.. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు, ఆవులు కాశారని, ఆయన కన్నా మనం గొప్ప వాళ్లమేం కాదన్నారు. మనల్ని ఏడుసార్లు ఏలిన నిజాం మనవడు కూడా ఆస్ట్రేలియాలో పదెకరాల్లో గొర్రెల వ్యాపారం స్వీకరించాడని, గతేడాదే ఆయన మరణించారని మంత్రి గుర్తు చేశారు. కులవృత్తితోపాటు విద్య, ఇతర రంగాల్లో రాణించాలన్నారు.
రాష్ట్రంలోని కోటీ 50లక్షల ఎకరాల్లో దాదాపు 50శాతం భూమి యాదవుల చేతుల్లోనే ఉందని, గతంలో వారికి భూములు ఉండేవి కాదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో యాదవుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తన వద్ద కూడా 90 గొర్రెలు, పొట్టేళ్లు, బెంగాల్ మేకలు ఉన్నాయని, జీవాలను పెంచడంపై ఆసక్తి అని మంత్రి తెలిపారు. జనరల్ స్థానం అయిన వనపర్తి మున్సిపాలిటీకి బీసీ, ఉద్యమకారుడు గట్టుయాదవ్ను చైర్మన్గా చేసుకున్నామన్నారు. వనపర్తిలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.10లక్షలు విరాళం అందిస్తానని, అందరి సహకారంతో అద్భుతంగా నిర్మించుకుందామన్నారు. యాదవ భవనానికి ఎకరా స్థలం, నిర్మాణానికి రూ.2.50కోట్లు కేటాయించి అందులో గ్రంథాలయం, కంప్యూటర్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మంత్రిని యాదవులు శాలువాతో సన్మానించి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, శిక్షణా తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్, గొర్రెల పెంపకందారుల జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరింత అభివృద్ధి చేస్తాం..
వనపర్తి రూరల్, సెప్టెంబర్ 24 : జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో క్రీడా పార్కు, ఏనుగుబొంద పార్కులను మంత్రి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే పలు వార్డుల్లో పార్కులను సుందరీకరించమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్ నాగన్న, మున్సిపల్ కమిషనర్ భరతసింహారెడ్డి, డీఈ వరలక్ష్మి, ఏఈలు భాస్కర్, సాయికిరణ్, కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ జీవితం ఉన్నతమైనది
వనపర్తి అర్బన్, సెప్టెంబర్ 24 : ఉపాధ్యాయ జీవితం ఉన్నతమైనదని మంత్రి పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రజలను చైతన్యం చేయడంలో ప్రథమ వరుసలో కవులు, ఉపాధ్యాయులే ఉంటారన్నారు. నేడు జరుగుతున్న అభివృద్ధిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కరువు కాటకాలతో తల్లడిల్లిన ఉమ్మడి పాలమూరు.. తొమ్మిదేండ్లలో పురోగతి సాధించిందన్నారు. అనంతరం అధ్యాపక, ఉపాధ్యాయులను మంత్రి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, సాహితీ కళావేదిక నిర్వాహకుడు శంకర్గౌడ్, కవి జానజ్వాల, బీఆర్ఎస్ నాయకులు, ప్రైవేట్ అధ్యాపక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.