రేషన్ డీలర్లకు సర్కారు తీపి కబురు అందించింది. కమీషన్ను రూ.900 నుంచి రూ.1,400 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వీటితోపాటు 13 అంశాలను పరిష్కరించి చేయూతనందించనున్నది. డీలర్గా పనిచేస్తూ మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద డీలర్షిప్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నది. అలాగే రూ.5 లక్షల బీమా, ఆరోగ్యశ్రీ వర్తింపు, డీలర్షిప్ రెన్యూవల్ను ఐదేండ్ల కాలపరిమితికి పెంచడం, వయోపరిమితిని 40 ఏండ్ల నుంచి 50 ఏండ్లకు పెంపు, అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.10 వేలు అందజేత వంటి అంశాలపై సానుకూలత వ్యక్తం చేయడంతో రేషన్ డీలర్లు ఖుషీఖుషీగా ఉన్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
గద్వాల, ఆగస్టు 9 : రేషన్ డీలర్లు ఎంతో కాలంగా ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని కమీషన్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డీలర్లు.. కమీషన్ పెంచాలని ఏప్రిల్లో సీఎం కేసీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి రేషన్ డీలర్లతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రులు హరీశ్రావు, గంగులకు సూచించారు. దీంతో మంగళవారం సచివాలయంలో రేషన్ డీలర్లతో సమావేశమై వారికి తీపి కబురు అందించారు. టన్ను బియ్యానికి రూ.200 కమీషన్ ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రూ.900కు పెంచగా.. ఇప్పుడు రూ.1,400కు పెంచింది.
అదేవిధంగా రైతుబీమా తరహాలో డీలర్లకు రూ.5లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించింది. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరగా డీలర్గా పనిచేస్తూ మరణిస్తే కారుణ్య నియామకం కింద డీలర్షిప్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. ఒకవేళ డీలర్ మరణిస్తే అంత్యక్రియలకు తక్షణ సహాయం కింద రూ.10వేలు మంజూరు చేయనున్నది. ఇతర ఉద్యోగుల మాదిరిగానే డీలర్లకు వయస్సు పరిమితిని 40 నుంచి 50 ఏండ్లకు పెంచింది. ప్రస్తుతం డీలర్షిప్ను రెండేండ్లకోసారి రెన్యువల్ చేస్తుండగా దానిని ఐదేండ్లకు పెంచింది. తమ సమస్యలను పరిష్కరించడంతో జిల్లాకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి డీలర్లు క్షీరాభిషేకం చేశారు.
ఉమ్మడి జిల్లాలో ..
నాగర్కర్నూల్ జిల్లాలో 558 రేషన్ దుకాణాలు ఉండగా 3,28,456 కార్డులు ఉన్నాయి. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా 4వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 333 రేషన్ దుకాణాలు ఉండగా 1,60,251 కార్డులకు గానూ ప్రతి నెలా 3,485 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. వనపర్తి జిల్లాలో 324 రేషన్ దుకాణాలు ఉండగా 1,55,000 కార్డులకు గానూ ప్రతి నెలా 2,600 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో 506 రేషన్ దుకాణాలు ఉండగా
2,39,717 కార్డులకు గానూ ప్రతి నెలా 40,850 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతున్నది. నారాయణపేట జిల్లాలో 300 రేషన్ దుకాణాలు ఉండగా 1,40,356 కార్డులకు గానూ ప్రతి నెలా 32,208 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
ఉద్యోగ భద్రత హర్షణీయం..
గతంలో రేషన్ డీలర్లు మరణిస్తే ఆ డీలర్షిప్ ఎవరికి ఇస్తారో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం కారుణ్య నియామకం కింద వారి కుటుంబానికే డీలర్షిప్ ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. దీంతో డీలర్ల కుటుంబాలకు చేయూతనిచ్చినట్లు అయింది. సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ ప్రభుత్వం డీలర్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. డీలర్ల సమస్యలు పరిష్కరించినందుకు సంతోషంగా ఉంది.
– మధు, డీలర్
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ఎన్నో ఏండ్లుగా రేషన్ డీలర్గా పని చేస్తున్నా. వచ్చే కమీషన్ ఏ మూలకూ సరిపోక కుటుంబ పోషణ భారంగా ఉండేది. మా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రితోపాటు మంత్రులకు విన్నవించాం. ఈ సందర్భంగా వారు మాకు శుభవార్త చెప్పారు. మేము అడిగిన డిమాండ్లలో చాలా వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీలర్లలో చాలామంది పేదవారు ఉన్నారు. వారు మరణిస్తే కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడేవి. మాకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రభుత్వం మేం అడిగిన కమీషన్ కంటే ఎక్కువే ఇవ్వడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– ఖాదీర్, రేషన్డీలర్ల సంఘం నాయకుడు