మరికల్, ఏప్రిల్ 19: స్వరాష్ట్రంలో సర్కారు బడులు నూతన శోభను సంతరించకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడుతలవారీగా పాఠశాలలను ఎంపిక చేస్తూ నిధులు మంజూరు చేస్తున్నారు. సర్కారు బడుల్లో అన్నిసౌకర్యాలు సమకూరుస్తూ నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషిచేస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దుతుండటంతో చూపరులను ఆకట్టుకున్నాయి.
మరికల్ మండలంలో మొత్తం 9పాఠశాలలు మొదటి విడుతగా మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, కాంపౌండ్వాల్, డైనింగ్ హాల్, ఫర్నిచర్, గ్రీన్ బోర్డు, వాషింగ్ ట్యాబ్స్, ఫ్యాన్స్, లైటింగ్, మూత్రశాలలు, భోజనశాలలు తదితర వాటిని నిర్మించారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సహకారంతో మండలంలో రూ.4కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు చేపట్టడంతో సర్కారు బడులు కొత్తకొత్తగా కనిపిస్తున్నాయి.