అయిజ, మే 8 : ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను సకాలంలో తరలించడంలో సర్కారు మొండికేస్తుంది. 20 రోజుల కిందట కాంటా వేసిన మక్కల బస్తాలను నేటికి గోదాంలకు తరలించకపోవడంతో రైతులు రేయింబవళ్లు మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. గత నెల 21వ తేదీ మక్కలను కాంటా వేసినా నేటికి గోదాంలకు తరలించడంలో జా ప్యం జరుగుతోంది. 20రోజులైనా మక్కల తరలింపుపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. లారీల సమస్యతోపాటు హమాలీల సమస్య తోడు కావడంతో తరలింపు జఠిలంగా మారింది. దీంతో మార్కెట్లోని మక్కల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి.
అయిజ సింగిల్ విండో ద్వారా మార్కెఫెడ్ ఇప్పటి వరకు 1,589మంది రైతుల నుంచి 1,94,748 (97,374 క్వింటాళ్లు) బస్తాల మక్కలు కొనుగోలు చేసింది. గోదాంలకు 1,00,754 బస్తాలను తరలించారు. ప్రస్తుతం మార్కెట్లో 93,994 బస్తాల మక్కలు నిల్వ ఉన్నాయి. అయిజ మార్కెట్లో మొక్కజొన్న బస్తాల తరలింపుపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సీరియస్ కాగా, జిల్లా అధికారులు గురువారం హుటాహుటిన మార్కెట్ను తనిఖీ చేసి మక్కల బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చినా మక్కల బస్తాలు తరలించకపోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణశాఖ మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేయడంతో రైతులకు కంటిమీద కునుకులేదు. ప్ర భుత్వం తక్షణమే బస్తాలను తరలించకపోతే ఆందోళనలకు సిద్ధమవుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
అయిజ మార్కెట్ యార్డులో కాంటా వేసి నిల్వ చేసిన మక్కల బస్తాలను సర్కారు లారీలతో గోదాంలకు తరలించకపోవడంతో రైతులే స్వయంగా ట్రాక్టర్లలో మక్కలను తరలిస్తున్నారు. హమాలీల సమస్య, లారీల సమస్యలతో కుంగిపోతున్న రైతులకు ట్రాక్టర్లలో తరలింపు మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మార్కెట్లో హమాలీల ఖర్చు, ట్రాక్టర్ కిరాయి, డీజిల్ వంటి ఖర్చులను రైతే స్వయంగా భరించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20రోజులైన మక్కల బస్తాలను తరలించడంలో సర్కారు, జిల్లా అధికారులు విఫమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు హమాలీల సమస్య, లారీల సమస్యను పరిష్కరించి మక్కల బస్తాలను తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.