తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతుండడంతో ప్రజలకు నమ్మకం పెరిగి బారులుదీరుతున్నారు. కేసీఆర్కిట్, అమ్మఒడి అమలుతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణులు సర్కారు వైద్యానికి జై కొడుతున్నారు. వనపర్తి మాతా శిశు సంరక్షణ కేంద్రం కాన్పుల్లో రికార్డు సాధించింది. ఒకేరోజు 32 డెలివరీలు కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 1612 ప్రసవాలు అయ్యాయి. వీటిలో 939 నార్మల్, 673 ఆపరేషన్లు జరిగాయి.
వనపర్తి, సెప్టెంబర్ 21 : గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండేది. ఇక కాన్పులకైతే కన్నెత్తి కూడా చూసేవారు కాదు. దీంతో ప్రైవేటు దవాఖానలను సంప్రదించి వేలల్లో ఖర్చు చేసుకొనేవారు. తెలంగాణ సర్కారులో ఈ బాధలన్నీ సీఎం కేసీఆర్ తీర్చేశారు. కార్పొరేట్కు ధీటుగా సర్కారు దవాఖానల్లో సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు ప్రతి నెలా వైద్య పరీక్షలు, కాన్పు కోసం 102 వాహనం, కేసీఆర్ కిట్టు, ప్రోత్సాహకంగా నగదు కూడా అందిస్తుండడంతో సర్కారు దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెరిగింది. గర్భందాల్చిన తరువాత గర్భిణులకు పౌష్టికాహారం లోపం రావొద్దనే ఉద్దేశ్యంతో న్యూట్రిషన్ కిట్లను సైతం అందజేస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి సమీపంలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు నుంచి నేటి వరకు మాతా శిశు సంరక్షణ కేంద్రం వైద్యులు, సిబ్బంది సమన్వయంతో రికార్డులు సృష్టిస్తున్నారు. కార్పొరేట్ తరహాలో దవాఖాన నిర్వహిస్తూ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. గర్భిణులకు ఓపీ, స్కానింగ్లను వారంలో రెండు రోజులు నిర్వహిస్తున్న తరుణంలో అత్యధికంగా తరలివచ్చి చూయించుకుంటున్నారు. జూన్ 21వ తేదీన ఒకే రోజు 28 కాన్పులు కాగా, ఆగస్టు 20వ తేదీన ఒకే రోజు 32 కాన్పులు చేశారు. అందులో మగపిల్లలు 20, ఆడపిల్లలు 12 కాగా, 17 సహజ కాన్పులు, 15 సర్జరీలు, మొదటి కాన్పులు 13 ఉన్నాయి. ఏరియా దవాఖానగా ఉన్న సమయంలో నెలకు 80 మాత్రమే జరిగేవని, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు తర్వాత 250కి పైగా కాన్పులు చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
జూన్ 21వ తేదీన ఒకే రోజు రికార్డు స్థాయిలో 28 కాన్పులు, ఆగస్టు 20వ తేదీన 32 కాన్పులు చేయడంతో విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ దవాఖానను సందర్శించి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. అంతేకాకుండా గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్న కారణంగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. దీంతోపాటు తల్లీబిడ్డ క్షేమానికి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుండడంతో ఎంతో మేలు చేకూరుతున్నది. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నారు. వైద్య సేవలు విసృత్తం కావడంతో ప్రజలకు నమ్మకం పెరిగింది. ఏరియా ఆసుపత్రి ఉన్నప్పుడు నెలకు 80 వరకు కాన్పులు కాగా, నేడు ఒకే రోజు 32 కాన్పులు కావడం గమనార్హం. నెలకు 250 వరకు కాన్పులు చేస్తున్నాం.
– నరేందర్ కుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్, వనపర్తి