అయిజ, అక్టోబర్ 20 : సర్కారు బడుల్లో త్వరలో సౌరకాంతులు తళుకులీననున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 77 పాఠశాలలను ఎంపిక చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. బడుల్లో డిజిటల్ బోధన అమలు చేస్తుండటంతో స్కూళ్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్నది. భవిష్యత్లో స్కూళ్లలో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు, బిల్లుల మోత లేకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చుతున్నారు. తొలివిడుత ఎంపిక చేసిన పాఠశాలల్లో కరెంట్ మీటర్లను తొలగించి నెట్ మీటర్లను ఏర్పాటు చేసి నేరుగా గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 12 స్కూళ్లల్లో ఇన్స్టాలేషన్ పనులు పూర్తి చేశారు. మిగతా 65 పాఠశాలల్లో సోలార్ పరికరాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సర్కారు బడుల్లో సకల సౌలతులు కల్పిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వసతులను కల్పిస్తున్నది. అందులో భాగంగా ప్రతి పాఠశాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
ప్రతి పాఠశాలలో సోలార్ పలకలను బిగించి డిజిటల్ తరగతుల బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పాఠశాలల్లో సోలార్ పరికరాలను అమర్చి ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించి, నెట్ మీటరింగ్ విధానం అమలు చేసి అవసరమైన విద్యుత్ను వినియోగించుకుని మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అందిం చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో), విద్యాశాఖ సంయుక్తంగా సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. తొలివిడతలో రాష్ట్రంలోని 1,521 స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇందులో భా గంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 77 పాఠశాలలను ఎంపిక చేశారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 50వేల ఖర్చు కానుంది. సోలార్ పరికరాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నేరుగా వినియోగించనున్నారు. అలాగే బ్యాటరీ ఇన్వర్టర్ల ద్వారా విద్యుత్ను నిల్వ చేసుకొని పాఠశాల అవసరం మేరకు వినియోగించుకుంటారు. మిగిలిన కరెంట్ను ‘గ్రిడ్’కు విక్రయించనున్నారు. జిల్లాలోని 12 పాఠశాలల్లో సోలార్ పరికరాల బిగింపు, ఇన్స్టాలేషన్ పనులను పూర్తి చేశారు.
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం ఏటా ఇచ్చే నిధుల్లో సగం విద్యుత్ బిల్లులకే ఖర్చవుతున్నది. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థుల్లోపు ఉన్న స్కూళ్లకు రూ.25వేలు, 100 మందికి పైగా ఉన్న పాఠశాలలకు రూ.50 వేలు నిర్వహణకు ఖర్చులు అందజేస్తుంది. స్కూళ్లలో డిజిటల్ బోధన పెరుగుతుండడంతో కంప్యూటర్లు, ఫ్యా న్ల వినియోగం ఎక్కువవడం, తాగునీటి సరఫరా, మొక్కల పెంప కం కోసం విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. కొన్ని స్కూళ్ల బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇక మీదట ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.
జిల్లాలోని 12 పాఠశాలల్లో సోలార్ పరికరాల బిగింపు, ఇన్స్టాలేషన్ పనులు పూర్తి చేశాం. మిగిలిన 65 పాఠశాలల్లో సోలార్ ప్యానళ్ల బిగింపు పనులు జరుగుతున్నాయి. అయిజ మండలంలో ఉత్తనూర్, ఎక్లాస్పురం, తూకుంట, గట్టు మండలంలో బల్గెర, ఆలూరు, ధరూర్ మండలంలో మన్నాపూర్, ఇటిక్యాల మండలంలో కొండేర్, కేటీదొడ్డి మండలంలో పురానపాలెం, నందిన్నె, రాజోళి మండలంలో మాన్దొడ్డి, పెద్ద ధన్వాడ, ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలివిడుత మన ఊరు- మన బడి కార్యక్రమంలో సోలార్ ప్యానళ్ల బిగింపు పనులు చేపడుతున్నాం. పను లు పూర్తికాగానే సోలార్ విద్యుత్ సరఫరా జరుగుతుంది.