పంపుల ద్వారా పరవళ్లు తొక్కి.. గుట్టలను ఎక్కి.. సొరంగాలను తొలచుకొని.. కాల్వల్లో గలగల పారుతూ.. రిజర్వాయర్లను నింపేందుకు కృష్ణమ్మ బిరబిరా తరలిరానున్నది. ‘పల్లె పల్లెనా పల్లెర్లు మొలిచే తెలంగాణలోనా.. పాలమూరులోనా..’ అన్న మాటలను మై మరపింపజేస్తూ.. దశాబ్దాల కలను సాకారం చేసేందుకు పీఆర్ఎల్ఐ సిద్ధమవుతున్నది. నాటి కరువు పరిస్థితులను చూసిన సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను దగ్గరుండి డిజైన్ చేశారు. ఇటీవలే గ్రీన్ ట్రిబ్యూనల్ నుంచి పర్యావరణ అనుమతులు రాగా.. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. కాళేశ్వరం కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటర్ల నుం చి నీటిని ఎత్తిపోసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పనులు పూర్తయి రిజర్వాయర్లు నిండి కరువుదీరా సాగునీళ్లు ఉంటాయని, దశాబ్దాల కల తీరనున్నదని రైతులు సంతో ష పడుతున్నారు. కేసీఆర్ వల్లే చిరకాల స్వప్నం నెరవేరనున్నదన్నారు. జాతీయ హోదా
కల్పించి నీటి వాటా తేల్చాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కర్షకలోకం అల్టిమేటం జారీ చేసింది.
మహబూబ్నగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరువు, వలసలు, ఆకలిచావులు, బీళ్లు వారిన పొలాలు, చుక్కనీరు లేక పశువులను అమ్ముకున్న దీనస్థితి.. ఇదంతా ఒకప్పటి పాలమూరు పరిస్థితి.. చెంతనే కృష్ణ, తుంగభద్ర, భీమా వంటి జీవనదులు ప్రవహిస్తున్నా.. ఇక్కడే వర్షించి పిల్లకాలువల్లో దుందుభీ పరవళ్లు తొక్కుతున్నా తాగునీటికి గోస పడ్డాం. పశువులకు మేత దొరక్క, సేద్యాన్ని నమ్ముకున్న భూమిపుత్రులు సాగును వదిలి పట్నానికి వలస వెళ్లిండ్రు.
వలసలకు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పాలమూరు జిల్లా స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొమ్మిదిన్నరేండ్లలో ఎంతో మార్పు చెందింది. బీడు వారిన నేలలు నేడు పచ్చని పొలాలుగా మారాయి.
వ్యవసాయం దండగని ఒకరంటే.. ఆత్మహత్య చేసుకోవడానికి సాగు చేస్తున్నావని పరిహసించారొకరు.. కానీ ఇక్కడి ప్రజల గోసను ఓ స్వాప్నికుడు ఆనాడు కలగన్నాడు. ఈ నెలపై కృష్ణమ్మను పారిస్తామని, ఆర్డీఎస్ షట్టర్లు పగులగొట్టి నీటి దోపిడి చేసిన దొంగల భరతం పడ్తామని, పద్నాగేండ్ల కిందటనే శపథం చేసి ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు. తెలంగాణ ఉద్యమం అనంతరం ముఖ్యమంత్రిగా నిలిచి తొమ్మిందేండ్లలో పాలమూరు రూపురేఖలనే మార్చివేసిండు. గులాబీ జెండా చేతబట్టి పాలమూరు కరువును పాలద్రోలి, ఇవాళ ఉమ్మడి జిల్లా ప్రజల కలను నిజం చేసిన కేసీఆర్ను చూసి రైతాంగం అబ్బురపడుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తుందని కలలో కూడా అనుకోలేదని రైతులు అంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి జిల్లా అంతటా సంబురాలు జరుపుకొంటున్నారు. ప్రాజెక్టును అడ్డుకొని తమాషా చూసిన విపక్షాలు నేడు నోరెళ్లబెడుతున్నాయి. కేంద్రం మెడలు వంచి పర్యావరణ అనుమతులు సాధించి పాలమూరు రైతాంగానికి సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేశారు. ఈసారి ఎన్నికల ప్రచారానికి వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని నిలదీస్తామని రైతాంగం అంటోంది.
చలించిన కేసీఆర్..
తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎన్నో సార్లు పాలమూరును సందర్శించారు. ఇక్కడి ప్రజ ల గోసను ప్రత్యక్షంగా చూశారు. జీవనదులున్నా బీ డు వారిన భూములను చూసి చలించిపోయారు. ఆర్డీఎస్ ఆనకట్టలను రాయలసీమ గూండాలు బాం బులతో పగులగొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే మౌనం వ హించిన ఉమ్మడి రాష్ట్ర నేతలను చూసిన రైతాంగం కన్నీళ్లు పెట్టుకున్నది. ప్రాజెక్టులు కడ్తామని చెప్పిన ప్రభుత్వాలు అక్కడో బొక్క.. ఒక్కడో బొక్క కొట్టి.. పిల్ల కాల్వలు తవ్వి ప్రజలను మోసం చేశాయి. ఈ దాష్టీకంపై కేసీఆర్ కదం తొక్కి ఆర్డీఎస్ రైతుల గోసపై పాదయాత్ర చేపట్టారు. ఎక్కడ చుక్కానీరు లేని పాలమూరును చూసి అప్పుడే శపథం చేశారు. పాలమూరు గోస స్వరాష్ట్రం వస్తేనే తీరుతుందని భావించి ఇక్కడి నుంచి 2009లో ఎంపీగా పోటి చే శారు. పాలమూరులో ఉద్యమమే లేదు.. కేసీఆర్ను ఓడగొడ్తామని ప్రగల్భాలు పలికిన బడానేతలకు ఖంగు తినిపిస్తూ.. కేసీఆర్ను గెలిపించారు. అనంతరం రాష్ట్రం వచ్చుడు ఖాయం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తీరుతామని చెప్పి 2014లో స్వరాష్ట్రం సాధించారు.
పీఆర్ఎల్ఐను డిజైన్ చేసిన కేసీఆర్
స్వరాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు కరువు తీరాలంటే ఏంచేయాలో చెప్పండని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను కేసీఆర్ ఆదేశించారు. ఈ జిల్లాకు చెందిన ఎంతోమంది ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు కలిసి పీఆర్ఎల్ఐకి డిజైన్ చేశారు. ఉమ్మడి జిల్లాలో సాగనీరు లేని ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ పక్కనే ఉన్నా రం గారెడ్డి, నల్లగొండతోపాటు హైదరాబాద్కు తాగునీ టి తిప్పలు తీర్చేందుకు దీన్ని రూపొందించారు. ఉ మ్మడి జిల్లాలో పదిలక్షల ఎకరాలు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 2లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టును చేపట్టారు. కాల్వల ద్వా రా కాకుండా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేస్తూనే సాగునీరు అందించే ఒకే ప్రాజెక్టు పీఆర్ఎల్ఐ కావ డం గమానార్హం. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో సుమారు 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వ్ చేసుకుంటూ కా ల్వల ద్వారా ఎక్కడికక్కడ సాగునీరు అందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు.
కాళేశ్వరానికి మించిన మోటర్లు..
కాళేశ్వరం ప్రాజెక్టులో బిగించిన పంపులు 139 హార్స్పవర్ గలవి. అంతకన్నా ఎక్కువ హార్స్ పవర్ కలిగిన పంపులను పీఆర్ఎల్ఐలో బిగిస్తున్నారు. ఓక్కో పంపు సామర్థ్యం 145 హార్స్ పవర్. ఏదుల, వట్టెం, ఉదండాపూర్తోపాటు మరో చోట నాలుగు పంపుహౌస్లను నిర్మిస్తున్నారు. దీంట్లో భారీ పంపులను బిగిస్తున్నారు. రోజుకు సుమారు 2టీఎంసీల నీటిని పంపింగ్ చేసే సామర్థ్యం ఈ పంపులకు ఉన్నది. కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా, అనుమతులు లేవని ఆంధ్ర సర్కార్ ఫిర్యాదులు చేసినా, పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి ప్రభుత్వానికి భారీ జరిమానా విధించినా.. కేసీఆర్ పట్టుదలతో ఎదుర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించి రైతులకు చిరస్మరణీయ కానుకనిచ్చారు. సీఎం కేసీఆర్కు ఈ జిల్లామీద ఉన్న మమకారం వల్లే ఇదంతా సాధ్యమైందని రైతాంగం అంటోంది. ఇక విపక్షాలను నిలదీసేందుకు రైతాంగం సిద్ధమవుతున్నది. జాతీయ హోదా కల్పించి.. నీటి వాటా తేల్చకుంటే బీజేపీ, కాంగ్రెస్ లెక్కలు మేం తేలుస్తామని ఉమ్మడి జిల్లా రైతాంగం అల్టిమేటం ఇస్తున్నది.
మా పొలాలన్నీపచ్చబడ్తయి..
నవాబ్పేట, ఆగస్టు 14 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం హర్షణీయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే మా పొలాలన్నీ పచ్చబడ్తయి. కాంగ్రెస్ నాయకులు కుట్రతో కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ మాకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ రిజర్వాయర్ కోసం వేయికండ్లతో ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల వల్ల ఆగిపోయిన పనులు ఇప్పడు ఊపందుకోనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మహాయజ్ఞంలా ప్రాజెక్టుకు రూపాంతరం చేసి, పనులు చేపడుతున్నారు. ఆయన లేకుంటే మాలాంటి బక్కచిక్కిన రైతులంతా ఆగమయ్యేవారు. గతంలో మా తండాల నుంచి ఎంతోమంది బతుకుదెరువు కోసం వలస పోయిండ్రు. తెలంగాణ వచ్చాక వలసలు తగ్గినయ్. ప్రాజెక్టు పూర్తయితే వలసలు పూర్తిగా ఆగిపోయి, ఇక్కడికే ఇతర ప్రాంతాల వాళ్లు వచ్చే అవకాశాలున్నయ్. కాంగ్రెస్ను మేము ఎట్టిపరిస్థితుల్లో నమ్మం. గత ప్రభుత్వాలు కేసీఆర్ మాదిరిగా పనులు చేపట్టి ఉంటే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.
– సామ్యానాయక్, రైతు, మామిడిచెట్టు తండా, నవాబ్పేట
‘పాలమూరు’తో ధాన్యపురాశులు..
ఒకప్పుడు పంటలు సాగు చేసేందుకు వాన కోసం ఆకాశం వైపు చూడాలి. కరెంటు కోసం కాపలా కాసేటోళ్లం. నీళ్ల కోసం అరిగోస పడ్డాం. నీళ్లు ఉంటే కరెంటు లేకుండే. ఏండ్లకు ఏండ్లు కరువేనాయే. వ్యవసాయం బంద్ చేసి వేరే పనులు చేసేవాళ్లం. కానీ తెలంగాణ వచ్చినంక మాకు సాగుపై భరోసా వచ్చింది. వందల కిలోమీటర్ల దూరం ఉన్న కృష్ణమ్మ మా వద్దకు వస్తుందంటే నమ్మలే. కానీ కేసీఆర్ సారు మా ఆశలను నిలబెట్టిండు. సారు పుణ్యమా అని పాలమూరు పథకంపై కమ్మిన మబ్బులు పోయినయ్. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా మా పొలాలకు నీళ్లు వస్తయ్. వట్టెం, కరివెన ప్రాజెక్టులు మా పక్కనే ఉన్నాయి. మాకు కరువే ఉండదు. పొలాల్లో బంగారం పండిస్తాం. వడ్లు, పత్తి, మక్కలు, మిర్చీతో మా ఇండ్లు నిండుతయ్. కేసీఆర్ఎస్ సారుకు ధన్యవాదాలు.
– పాండురంగారెడ్డి, రైతు, ఇప్పలపల్లి, తిమ్మాజిపేట
కాల్వలతోనే మాకు సాగునీరు
కరివెన ప్రాజెక్టు పూర్తయి కాల్వలు తవ్వితేనే మా గ్రామానికి సాగునీరు వస్తది. అంతకు మించి వేరే దారి లేదు. ప్రాజెక్టుపై గప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఎంతో శ్రమించారు. అనుమతులు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సారి ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే త్వరగా పూర్తవుతాయి. సాగునీరు కావాలనుకునే ప్రతి ఒక్కరూ కేసీఆర్ వెంటే నడిచి కారు గుర్తుకే ఓటు వేయాలి.
– బోయరాజు, రైతు దాసరిపల్లి, మూసాపేట మండలం
అనుమతులు రావడం శుభప్రదం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం శుభప్రదం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాయితీ పాలనకు నిదర్శనం. పీఆర్ఎల్ఐ రాకుండా అడ్డుకున్న వారికి ఇది చెంపపెట్టు లాంటిది. ఈ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎంతోమంది రైతుల ఇక్కట్లు తప్పడంతోపాటు సాగు విస్తీర్ణం పెరిగే అవకావశం ఉంది. మేమంతా ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– సందోళ్ల చిన్న హన్మయ్య, రైతు
సీఎం కేసీఆర్ సార్కు సాటిలేరు..
రాష్ట్రంలో సాగుకు నీరు అందించడంలో సీఎం కేసీఆర్ సార్కు ఎవరూ సాటిరారు. తొమ్మిదేండ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి, పంటల సాగుకు నీరు పుష్కలంగా అందిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు వస్తది. ఈ ప్రాజెక్టును నిర్మించకుండా ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించారు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా, సాగునీరు ఇస్తమని చెప్పిండ్రే తప్పా పని చేయలేదు. సీఎం కేసీఆర్ సార్ చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి పంటలకు నీరిస్తున్నడు. మొక్కవోని పట్టుదలతో కేసీఆర్ సార్ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు సాధించడం సంతోషకరం.