జోగులాంబ గద్వాల : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళలు అంటే కేవలం వంటింటికే పరిమితమయ్యే అబల కాదు..సబల అని నిరూపించాలని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 2కే రన్, ఇండోర్ స్టేడియంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలనుద్దేశించి మాట్లాడారు. మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి మహిళా దీన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణించాలని పిలుపునిచ్చారు. మహిళా శక్తిని చాటి చెప్పే విధంగా పోలీసు శాఖ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ రోజు మనది, మన శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పేలా మహిళలు ముందుకు సాగాలని కోరారు. అనంతరం మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా దవాఖానలో బాలింతలకు కేసిఆర్ కిట్ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, మిస్ ఆసియా విన్నర్ రష్మీ ఠాగూర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ తదితరులు పాల్గొన్నారు.