జోగులాంబ గద్వాల : మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల పాలనలో రాష్ట్రం అతలకుతలం అయ్యిందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్(BRS) ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్( RS Praveen Kumar) ఆరోపించారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పదేళ్ల కేసీఆర్(KCR) పాలనలో జరిగిన అభివృద్ధికి వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గమనించి ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. నేను కేసీఆర్ నిర్వహించిన గురుకుల పాఠశాలకు కార్యదర్శిగా పనిచేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దానని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కూడా రైతుల కోసం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు వెళ్లి రైతుల కష్టసుఖాలను తెలుసుకున్నారని కొనియాడారు.
ఇతర పార్టీలకు చెందిన నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవాలనే తపన కన్న రైతులు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ (CM Revanth) పై ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభిలాష్ రావు నాయకులు కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.