జోగులాంబ గద్వాల : కరువుకు నిలయంగా మారిన జిల్లాలోని నడిగడ్డ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేరాని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం గద్వాల ఎంపీపీ ప్రతాప్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో పట్టణాలకు వలస వెళ్లి జీవనం సాగించే నడిగడ్డ రైతులు, నేడు సొంత గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి పనుల కోసం కూలీలు వలస రావడం హర్షణీయమన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైందన్నారు. రైతులను రైతు బంధు ద్వారా ఆదుకున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఎమ్మెల్యే మనసారా కోరుకున్నారు.
కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుభాన్, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రామేశ్వరమ్మ, జడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీ దామోదర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.