జోగులాంబ గద్వాల : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైనవన్ని సంసిద్ధంగా ఉంచాలనికలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం గద్వాల్ మండలం తుర్రకోనిపల్లి, ముల్కలపల్లి , తెలుగోనిపల్లి, లత్తిపురం గ్రామాలలో డి.ఆర్.డి.ఎ ఆధ్వర్యంలో ఉన్న ఐ.కే.పి సెంటర్లను జిల్లా ఎస్.పి రంజన్ రతన్ కుమార్తో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో టార్ఫలిన్లు, గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్లు, తేమ శాతం గుర్తించే మెషిన్లు అన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. పరికరాలు అన్ని పని చేస్తున్నాయో లేదో ముందే చెక్ చేసుకోవాలని సూచించారు. రైతుల ఫోన్ నెంబర్లకు తప్పనిసరిగా ఆదార్ లింక్ చేయాలనీ, తేమ శాతం 17% ను మించకుండా చూసుకోవాలని తెలిపారు.
ఐ.కే.పి సెంటర్ లు మొత్తం ఎన్ని ఉన్నాయని , ధాన్యం ఎంత కొనుగోలు చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కనెక్షన్లో అంతరాయం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డి.ఎస్.ఓ రేవతి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, అసిస్టెంట్ డి.ఆర్.డి.ఎ సరోజ, తదితరులు పాల్గొన్నారు.