మక్తల్ టౌన్, మే 21 : జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు సీఐ సీతయ్య తెలిపారు. శనివారం మక్తల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాకు చెందిన సంగమేశ్, మహేశ్వర్రెడ్డి, మహాన్తేజ్.. మక్తల్ పట్టణంలో అద్దెకు ఉంటూ చోరీలు చేసేవారు.
ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో అర్ధరాత్రి మెడికల్, మెకానిక్, ఆటోమొబైల్, మొ బైల్ షాప్ తాళాలు పగలగొట్టి సెల్ఫోన్లతోపాటు రూ.2.50 లక్షలు దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి పారిపోతున్న నిందితులను పట్టుకొని విచారించారు. దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. అంతకుముందు కర్ణాటకలోని గురిమిట్కల్లో వారి పై కేసులు నమోదైనట్లు చెప్పారు. సంగమేశ్, మహేశ్వర్రెడ్డి, మహాన్తేజ్ నుంచి రూ.1.05 వేలు, 8 సెల్ఫోన్లు, సోనీ కెమెరా, బైక్ రికవరీ చేశామన్నారు. వారికి సహకరించిన విశ్వరాధ్య పరారీలో ఉన్నాడన్నారు. కేసును ఛేదించిన ఎస్సై రాములు, సిబ్బంది రామాంజనేయులు, నరేశ్, తిరుపతి రెడ్డిని సీఐ అభినందించారు.