అయిజ, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం త్రివర్ణ శోభయామానంగా వెలుగొందుతున్నది. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా తుంగభద్ర జలాశయానికి మువ్వన్నెల రంగులతో విద్యుద్దీపాలంకరణ చేశారు. తుంగభద్ర డ్యాం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఉప్పొంగుతున్నది. దీంతో అధికారులు 33 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఇన్ఫ్లో 94,508 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 94,508 క్యూసెక్కులు ఉంది.
105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 103.098 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికిగానూ, ప్రస్తుతం 1632.33 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతున్నది. ఆనకట్టకు ఇన్ఫ్లో 1,03,800 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,03,400 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 400 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు.
శ్రీశైలం 10 గేట్లు ఎత్తి..
శ్రీశైలం, ఆగస్టు 14: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద కొనసాగుతున్నది. నాలుగు లక్షలకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో శనివారం ఉదయం నుంచి డ్యాం 10 గేట్లను 12 అడుగుల ఎత్తులో తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,57,754, విద్యుదుత్పత్తి ద్వారా 26,406, సుంకేసుల నుంచి 94,323 క్యూసెక్కుల (మొత్తం 3,78,483 క్యూసెక్కులు) నీరు శ్రీశైలానికి విడుదల కాగా సాయంత్రం వరకు 3,89,362 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తులో తెరిచి 3,17,460, కుడి. ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 62,234 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులకుగానూ 884.40 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.80 టీఎంసీలకుగానూ 211.95 టీఎంసీలుగా నమోదైంది.
జూరాలకు ..
అమరచింత, ఆగస్టు 14: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 2.77 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టు అందాలను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ప్రాజెక్టు నుంచి భీమా లిఫ్ట్ -2కు 750, కుడికాలువకు క్యూసెక్కులు 625, ఎడుమ కాలువకు 640 క్యూసెక్కులు, ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, 38 గేట్లను తెరిచి అధికారులు 2.86.119 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.