తెలంగాణ ఏర్పడ్డాక వలసలకు అడ్రస్సు మారిపోయింది. ఇక్కడి గ్రామాల నుంచి వలసలు నిలిచి ఇతర రాష్ర్టాల పేదలే వలసలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, బీహార్,జార్ఖండ్, ఇతర రాష్ర్టాల నుంచి వలసొచ్చి భవన నిర్మాణం,హోటళ్లు, ఇతర పనులు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతబట్టుకొని ఇక్కడికొచ్చి బతుకు బండి లాగుతున్నారు. దీంతో అడపాదడపా కనిపించే ఇతర రాష్ర్టాల ప్రజలు ఇప్పుడు సాధారణంగా మారిపోయారు.
మహబూబ్నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పొట్టకూటి కోసం మహానగరాల బాట పట్టిన పాలమూరు జిల్లా.. తెలంగాణ వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. వలసల జిల్లాగా ఖ్యాతి గడించిన జిల్లాకే స్వరాష్ట్రంలో వలసలు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో దాదాపు 8 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో అదనంగా మరో రెండు లక్షల ఆయకట్టుకు సాగునీరందుతున్నది. నిరంతర ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న కూలీలు సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఉత్తరాది రాష్ర్టాల నుంచి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయం పనుల నిమిత్తం దాదాపుగా 50వేల మందికి పైగా కూలీలు వచ్చినట్లు లేబర్ ఆఫీసర్లు చెబుతున్నారు.
తక్కువ కూలీ.. ఎక్కువ పని గంటలు
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు ఎక్కడ పనికి ఒప్పందం కుదుర్చుకుంటారో.. అక్కడ పని పూర్తయ్యే వరకు విశ్రమించరు. దీంతో రైతులకు ఎక్కువగా పనిగంటలు కలిసి వస్తున్నాయి. అంతేకాక స్థానికంగా ఉన్న కూలి కంటే తక్కువకే పని చేస్తున్నారు. పెద్ద పెద్ద రైతులు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. స్థానికంగా ఉండడానికి వసతులు కల్పిస్తున్నారు. దీంతో ఉదయాన్నే పొలాల బాట పట్టి.. పొద్దుపోయాక తిరిగి వస్తున్నారు. అవసరమైతే ఎక్కువ సమయం పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
గుంపు మేస్త్రీలకు పండుగే..
ఇతర రాష్ర్టాల నుంచి వ్యవసాయ కూలీలను తీసుకొచ్చేందుకు గుంపు మేస్త్రీలు భారీగా ముట్టజెబుతున్నారు. ఎకరానికి ఇంత అని మాట్లాడుకుని.. భోజనం, వసతి పోనూ మిగతా డబ్బులను కూలీలకు చెల్లిస్తున్నారు. చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామానికి చెందిన రైతు భాస్కర్రెడ్డి 20 మంది బీహార్ కూలీలను పిలిపించుకొని నాట్లు వేయించుకున్నాడు. తక్కువ కూలి ఇచ్చినట్లు చెప్పారు. గుంపుమేస్త్రీకి అదనంగా కమీషన్ ఇచ్చామన్నారు. వారం రోజుల్లో చేయాల్సిన పని నాలుగు రోజుల్లోనే పూర్తయిందని చెబుతున్నాడు.