ఇక్కడి పనులను ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తాం
కేంద్ర అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రప్రకాష్ గోయల్
ఏటీఆర్లో అధికారుల పర్యటన
అచ్చంపేట, ఫిబ్రవరి 27: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంరక్షణ, అడవులు, వన్యప్రాణుల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రప్రకాశ్ గోయల్ అన్నారు. ఇతర రాష్ర్టాల్లోని టైగర్ జోన్లలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపా నేషనల్ సీఈవో సుభాష్చంద్ర, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ డాక్టర్ ఎస్పీ యాదవ్, ఉత్తరప్రదేశ్ పీసీసీఎఫ్ మధుశర్మ, నేషనల్ కంపా జాయింట్ సీఈవో రమేశ్కుమార్ పాండే, తెలంగాణ అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ బృందం రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం వారు నల్లమలలో ప్రవేశించారు. ఈ సందర్భంగా మన్ననూర్ చెక్పోస్టు వద్ద కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. రాత్రి దోమలపెంట అటవీశాఖ అతిథి గృహంలో బస చేశారు. ఆదివారం ఉదయం నల్లమలలో అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాలు తెలుసుకున్నారు. పులుల సంరక్షణ, అటవీ, టూరిజం అభివృద్ధిని పరిశీలించారు. సోలార్ బోర్వెల్ను ప్రారంభించారు. ఫరహాబాద్ వద్ద ఏర్పాటు చేసిన సఫారీని పరిశీలించి వ్యూ పాయింట్ అందాలను తిలకించారు. అడవిలో ఏర్పాటు చేసిన ఫైర్ టవర్లు, ఫైర్లైన్లు, వనమూలిక కాటేజీలను పరిశీలించారు. మన్ననూర్ చెక్పోస్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రవేశ ద్వారాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ సెగ్రిగేషన్ షెడ్డు, హెల్త్ క్లినిక్, సీబీటీ టైగర్ టూరిజం ప్యాకేజీలను చూసి అభినందించారు. దేశవ్యాప్తంగా 50 టైగర్ ఫారెస్టు జోన్లు ఉన్నాయని తెలిపారు. అక్కడ పులులు, వన్యప్రాణులు, అడవిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ ప్రారంభించారు.
అచ్చంపేటలో అభివృద్ధి పనులు ప్రారంభం
అచ్చంపేటలో రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అటవీశాఖ కార్యాలయం చెక్పోస్టు వద్ద సమావేశగదిని ప్రారంభించి అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం, మెడిసినల్ బయోపార్కుకు శంకుస్థాపన చేశారు. పార్కులో 500రకాల మొక్కలు నాటాలని ఆదేశించారు. సోమవారం ఆమె ఉద్యోగ విరమణ సందర్భంగా అటవీశాఖ ఉద్యోగులు, అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఎఫ్డీపీటీ శ్రీనివాస్, డీఎఫ్వో కృష్ణాగౌడ్, ఎఫ్డీవో రోహిత్ గోపిడి, అచ్చంపేట, అమ్రామాద్ డివిజనల్ అధికారులు, రేంజ్, సెక్షన్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.