గద్వాల, మార్చి 28: యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిషత్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్పర్సన్ మాట్లాడారు. మిగతా రాష్ర్టాల్లో కేంద్రం ఏ విధంగా ధాన్యం సేకరిస్తుందో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోతే అవసరమైతే రైతులతో కలిసి ఢిల్లీలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అన్ని పార్టీలు రైతుల తరఫున మద్దతు తెలుపుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తదితర పథకాలు అమలు చేస్తూ చేయూతనిస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామాలతో పాటు మండల సర్వసభ్య సమావేశాలు, జిల్లా పరిషత్ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు. రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి తాము పని చేస్తామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించే ఏ నిర్ణయం కేంద్రం తీసుకున్న దానిని వ్యతిరేకిస్తామని చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈవో విజయనాయక్, డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం, జెడ్పీవైస్ చైర్మన్ సరోజమ్మ, జెడ్పీటీసీలు హనుమంతురెడ్డి, రాజు, రాజశేఖర్, సుగుణమ్మ, పద్మావెంకటేశ్వర్రెడ్డి, శ్యామల, ఎంపీపీ విజయ్కుమార్, కోఆప్షన్ సభ్యులు ఇమామ్, నిషాక్ తదితరులు పాల్గొన్నారు.