గద్వాల, అక్టోబర్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లాలో మిషన్భగీరథ పనులు పూర్తయ్యాయి. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి మిషన్భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో మహిళలు తాగునీటికి అవస్థలు పడి బోరుబావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మిషన్భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయించి మహిళల కష్టాలను తీరుస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీంతో జలజీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్కుమార్ ఈ పథకంపై ప్రశంసలు కురిపించారు. దీంతో దేశస్థాయిలో గుర్తింపు వచ్చింది.
631ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా సరఫరా
జిల్లాలో 631ఓవర్హెడ్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పాత ట్యాంకులు 297ఉండగా కొత్త ట్యాంకులు 334నిర్మించి మిషన్భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్భగీరథ హెడ్వర్క్ నుంచి ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నారు. జూరాల హెడ్వర్క్ వద్ద శుద్ధిచేసిన నీటిని మొదట ధరూర్ మండలం మన్నాపురం సమీపంలోని కోరుకొండయ్యగుట్టపైకి తరలించి అక్కడినుంచి పైప్లైన్ ద్వారా అన్ని గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మొత్తం 1,388 కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేశారు. మిషన్భగీరథ పథకంలో ప్రధాన భాగమైన ఇంట్రా విలేజ్ ద్వారా జిల్లాలో 1,37,959 ఇండ్లకు కనెక్షన్ ఇచ్చి సరఫరా చేస్తున్నారు. గ్రామంలో పైప్లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వద్ద నల్లా బిగించారు. వీటితోపాటు 425 ప్రభుత్వ పాఠశాలలకు, 600 అంగన్వాడీ సెంటర్లకు, 79 రైతువేదికలకు, 164 వైకుంఠధామాలకు, 50 పబ్లిక్ హెల్త్సెంటర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు 100లీటర్ల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 135లీటర్ల చొప్పున రక్షిత మంచి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ నీటిని క్రమం తప్పకుండా విడుదల చేస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరాకు ఎ లాంటి ఇబ్బంది లేకుండా మిషన్భగీరథ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నీటి సమస్య తీరింది..
గతంలో తాగునీటికి చాలా ఇబ్బందులు పడేవాళ్లం. నీళ్లు తెచ్చుకోవాలంటే కిలోమీటరు మేర నడిచి వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీసేవాళ్లం. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటికోసం మహిళలు ఇబ్బందులు పడకుండా మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందిస్తున్నారు. మహిళలు నీటికోసం పడుతున్న కష్టాలు తొలగిపోయాయి. – మాధవి, దేవబండ, అయిజ