గద్వాల టౌన్, ఆగస్టు 16 : గద్వాల కోటలోని ఎంఏఎల్డీ కళాశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గు ర్తింపు.. సువిశాలమైన ప్రాంగణం.. నిష్ణాతులైన అధ్యాపకులు.. సకల సౌకర్యాలతో సొంత భవనం.. ఉన్నత ప్రమాణాలతో ఆధునిక విద్య.. ఉత్తమమైన డిజిటల్, కంప్యూటర్ విద్య.. అతి పెద్ద క్రీడాప్రాంగణం.. ఇలా ఎన్నో సౌకర్యాలు.. గద్వాల మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సొంతం.. ఈ కళాశాలలో చదివిన వారు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. కవులు, కళాకారు లు, రచయితలు, క్రీడాకారులుగా రాణించి గద్వాల పేరును రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిలబెట్టారు. దేశ, విదేశాల్లో చాలా మంది స్థిరపడ్డారు. కార్పొరేట్కు దీటుగా ముందుకు సాగుతూ తన చరితను చాటుకుంటున్న ఈ కళాశాల న్యాక్ గుర్తింపు కోసం మరోసారి సన్నద్ధమవుతున్నది. ఈ నెల 17, 18వ తేదీల్లో న్యాక్ బృందం పర్యటించనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
కళాశాల ఏర్పాటు ఇలా..
ఉమ్మడి పాలనలో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో అ ప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు జిల్లాకో కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో గుర్తింపు సాధించిన కళాశాలకు రూ.50వేల స హకారం అందిస్తామన్నారు. గద్వాల నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు పాగపుల్లారెడ్డి ముందుకొచ్చారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా, అధ్యక్షుడిగా సంస్థానాధీశుడు, ఎమ్మెల్యే రాజాకృష్ణభూపాల్ ఎంపికయ్యారు. రామకృష్ణభూపాల్ సారథ్యంలో పాగపుల్లారెడ్డి, డీకే స త్యారెడ్డి కళాశాల ఏర్పాటుకు విశేష కృషి చేశారు. కోటలో ఏర్పాటు చేయాలని మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మను కోరగా.. ఆమె అంగీకరించి ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలోని భవన సముదాయాలను కళాశాల కు అప్పగించారు. దీంతో 1957లో కళాశాలను ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీ గుర్తింపు సాధించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేలను అప్పటి కలెక్టర్ శంకర్.. కమిటీకి అందజేశారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల (ఎంఏఎల్డీ)గా అవతరించింది. మరో రూ.లక్షతో కళాశాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో మూడేండ్లపాటు కొనసాగగా.. ఆ తరువాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ డిగ్రీ, పీజీ కళాశాలగా ఆధునిక విద్య వైపు అడుగులు వేస్తున్నది.
వసతుల కల్పన..
2015లో రాష్ట్రంలోనే మొదటిసారిగా గద్వాల డిగ్రీ కళాశాలలో రూ.3.80లక్షలతో రెండు ఇంటరాక్టివ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య మూడుకు చేరుకున్నది. డిజిటల్ బోధనకు 145 కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు. సువిశాలమైన 13 ల్యాబ్లు ఏ ర్పాటు చేశారు. ఆరు బ్లాక్లలో 54 గదులు ఉన్నాయి. డిగ్రీతోపాటు పీజీ కళాశాల కూడా ఉన్నది. ఈ రెండు కళాశాలల్లో 2,382 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 53 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో బీఏ, సీబీసీఎస్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, డాటా సైన్స్, స్టాటిక్స్తోపాటు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వివిధ కో ర్సులు ఉన్నాయి. పీజీలో ఎంఏ ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, ఎంకాం, ఎంఎస్సీ మ్యాథ్స్ కోర్సులు ఉన్నాయి. విద్యార్థినులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక భవనం, ఇండోర్, ఔట్డోర్ క్రీడలు ఆడేందుకు సౌకర్యవంతమైన క్రీడా మైదానాలు ఉన్నాయి.
సీసీ కెమెరాలు, సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ, కళాశాల గ్రాంట్స్, పట్టణ ప్రముఖులు ఇచ్చిన విరాళాలు మొత్తం రూ.కోటితో కళాశాల చుట్టూ సీసీ రోడ్లు, గ్రౌండ్ అభివృద్ధి, క్యాంటీన్, వెయిటింగ్ హాల్, గార్డెనింగ్, సంస్థానాధీశుడు రాజా సీతారాంభూపాల్ విగ్రహం ఏర్పాటు, శిథిలావస్థకు చేరిన భవనాల పునర్నిర్మాణం వంటి పనులు చేపట్టారు. కళాశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అధ్యక్షతన అల్యూమినీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిధులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, 2005లో కళాశాలను మొదటిసారి, 2015లో మరోసారి న్యాక్ బృందం సందర్శించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ నెల 17, 18వ తేదీల్లో న్యాక్ బృందం పర్యటించనున్నది. గద్వాల ఎంఏఎల్డీ కళాశాలను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రిన్సిపల్ శ్రీపతినాయుడు తెలిపారు. న్యాక్ బృందం సందర్శించడం ఇదే చివరిది అయినందున ఉత్తమ గ్రేడ్ సాధించాలని ఆశిస్తున్నామన్నారు. ఉత్తమ గ్రేడ్ సాధిస్తే నిధులు సమకూరే అవకాశం ఉందన్నారు.