గద్వాల, జూన్ 23: మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని, కళాశాలల్లో 30మంది వలంటీర్లను ఏర్పాటు చేసి వారికి సేఫ్టీ, సైబర్నేరాలు, బ్లాక్మెయిలింగ్, లీగల్ సమస్యలపై శిక్షణ ఇవ్వనున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ విభాగం అధికారిణి స్వాతి లక్రా అన్నారు. ప్రతి జిల్లాలో 50పాఠశాలలు ఎంపిక చేసి అందులో ఒక బాలిక, బాలుడిని ఎంపిక చేసి లైంగిక దాడులను ఎలా అరికట్టాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జెడ్పీచైర్పర్సన్ సరిత, కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్లకు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 100మంది బాధితులకు న్యాయం చేయడంతోపాటు ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 11చోట్ల భరోసా సెంటర్లు ఉన్నాయని త్వరలో మరో 10చోట్ల ఏర్పాటు చేసి బాధిత మహిళలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. కేసుల విషయంలో రోజువారీ మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం సీఎం కేసీఆర్ షీ టీమ్స్, సఖీ సెంటర్లు ఏర్పాటు చేసి వారిలో ఆత్మ విశ్వాసం నింపుతున్నారన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో భరోసా సెంటర్లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు. అనంతరం ఆమె సఖీ కేంద్రాన్ని సందర్శించి బాధిత మహిళలతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సఖీ కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ మహిళలకు అండగా ఉంటామని చెప్పారు. మహిళల రక్షణకు చేయూతనిస్తామని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ మహిళా చట్టాలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎవరి సహాయం కోరకుండా మనకు మనమే భరోసా కల్పించుకోవాలని సూచించారు.
జిల్లాలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ఎస్పీ రంజన్ రతన్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2013నుంచి ఇప్పటి వరకు 305 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో నలుగురికి శిక్ష పడగా, 121 కేసులు కొట్టివేశారని 154 కేసులు ట్రయల్ నడుస్తున్నాయని 22 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయన్నారు. 41కేసుల్లో బాధితులకు రూ.18లక్షల పరిహారం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాగలత, అదనపు ఎస్పీ రాములునాయక్, శిశుసంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగం, డీఎస్పీ రంగస్వామి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, గట్టు ఎంపీపీ విజయ్కుమార్ పాల్గొన్నారు.