ఆత్మకూరు, మే 10 : రెండేండ్ల తరువాత జరుగుతున్న పది, ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రశాంత వాతావరణంలో చదువుకుందామనుకుంటే శబ్ధ కాలుష్యం ఆటంకం కలిగిస్తున్నది. వాహనాలు, శుభకార్యాల్లో మైకులు, డీజేల శబ్ధాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షల వేల రణగొణ ధ్వనులు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఇలాగే తీవ్ర ధ్వనులకు దీర్ఘకాలం గురైతే శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తున్నదని వైద్యులు చెబుతున్నారు. గోల ఆపండి..! అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
పరీక్షల వేళ ఎంటీ గోల..?
మహానగరాలు, నగరాల్లోని సాధారణ కూడళ్లలో 80 నుంచి 120 డెసిబుల్స్, పట్టణాల్లో 60 నుంచి 100 డెసిబుల్స్ రికార్డవుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇది చాలా ఎక్కువ.. తీవ్రమైన ధ్వనులకు దీర్ఘకాలం గురైతే శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. పరీక్షల వేళ అధిక శబ్ధాలతో విద్యార్థుల భవితకు గొడ్డలిపెట్టుగా మారిందని విద్య, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, విద్యార్థులు ఉన్న చోట 35 డెసిబుల్స్కు మించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చస్తున్నది. ఇది మన వద్ద అమలు జరగడం లేదు. ఇంట్లో సాధారణ సంభాషణ, టీవీ, సెల్ఫోన్ అన్ని శబ్ధాలు కలిసి ఏకకాలంలో 60-80 డెసిబుల్స్ చప్పుళ్లను సృష్టిస్తున్నాయి. వీటి మధ్య చదువుపై మనస్సు నిల్పడం కత్తిమీద సామే. ఇదిలా ఉంటే రద్దీ ప్రదేశాల మధ్యనే పరీక్షా కేంద్రాలు ఉంటున్నాయి. విద్యార్థి ఓ వైపు ప్రశ్నాపత్రంతో కుస్తీ పడుతూనే.. బయటి నుంచి వచ్చే శబ్ధాలతో విద్యార్థుల దృష్టి అటు వైపు వెళ్తున్నది.
పరీక్షల వేళ చిట్టి బుర్రలపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. రోజంతా పాఠ్యాంశాలను మననం చేసుకుంటూ ఏ ప్రశ్నలిస్తారో.. ఎలా రాస్తామోననే టెన్షన్లో తలకిందులవుతుంటారు. ఆ సమయంలో అంతా ప్రశాంతంగా ఉంటేనే పరీక్ష రాయగలరు. ఒక చిన్న అలజడి సైతం వారి ఏకాగ్రతను భగ్నం చేస్తుంది. నగరాల్లో ఇప్పటికే శబ్ధ కాలుష్యం ప్రమాణాలను దాటిపోయింది. రోడ్ల మీదకు వస్తే చెవులు చిల్లులు పడేలా వాహనాల హారన్లు, లౌడ్ స్పీకర్లు, మైకులు, సెల్ఫోన్ మాటలు సాధారణ పరిస్థితుల్లోనే ఎంతో చికాకు తెప్పిస్తాయి. అలాంటిది పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎంత చిరాకు కలుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో పరిమిత శబ్ధంతో మైకులు పెట్టుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. ధ్వని కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సెక్షన్-290 కింద న్యూసెన్స్ కేసు నమోదు చేస్తామని, బాధ్యుల్ని కోర్టులో ప్రవేశపెట్టి జరిమానా విధిస్తామన్నారు.