గద్వాల, మే 5 : సీఎం కేసీఆర్ చొరవతో వైద్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సమైక్య రాష్ట్రంలో సర్కార్ దవాఖానల్లో రోగులకు అవసరమైన సూది, గోళిలు అందుబాటులో ఉండేవి కావు. దీంతో ప్రైవేట్ దవాఖానల వైపు మొగ్గు చూపేవారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలు బలోపేతమయ్యాయి. అవసరమైన మేరకు సిబ్బందిని నియమించడంతో రోగులకు మెరుగైన వైద్యం అందుతున్నది. గతంలో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చుచేసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానలోనే అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. అలాగే సర్కార్ దవాఖానల్లో సాధారణ కాన్పులు జరుగుతుండడంతో జిల్లా ప్రభుత్వ దవాఖానకు మహిళలు క్యూ కడుతున్నారు. ఒక్క నెలలోనే సుమారు 200 మందికి సాధారణ కాన్పులు చేశారు. నొప్పులు భరించలేని సమయంలో కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో నెలకు ఒకటి లేదా రెండు సిజేరియన్ చేస్తున్నారు. జిల్లా దవాఖానలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,843 సాధారణ కాన్పులు చేశారు. రాష్ట్రంలో జిల్లా దవాఖాన రెండో స్థానంలో నిలిచింది. జిల్లా దవాఖానలో సాధారణ కాన్పులు పరిశీలిస్తే.. గతేడాది ఏప్రిల్లో 121, మేలో 126, జూన్లో 141, జూలైలో 151, ఆగస్టులో 142, సెప్టెంబర్లో 173, అక్టోబర్లో 180, నవంబర్లో 132, డిసెంబర్లో 184, ఈ ఏడాది జనవరిలో 144, ఫిబ్రవరిలో 149, మార్చిలో 200.. ఇలా మొత్తం 1,843 సాధారణ కాన్పులు చేశారు.
సర్కార్ సహకారంతోనే..
సాధారణ కాన్పుల విషయంలో జిల్లా దవాఖాన రా ష్ట్ర స్థాయిలో రెండో స్థానం లో నిలవడం గర్వకారణం. వైద్యులు, సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలో కా న్పులు చేయించుకోవాలంటే భయపడేవారు. ఇప్పుడు సర్కార్ అన్ని సౌకర్యాలు కల్పించడంతో పురుడు పోసుకోవడానికి వచ్చే వారిలో భయం పోయింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి లేకుంటే ఎక్కువ శాతం సాధారణ కాన్పులు చేయడానికే ప్రాధాన్యమిస్తాం. ఇక్కడ కాన్పు చేసుకున్న వారికి కేసీఆర్ కిట్తోపాటు ప్రభుత్వం రూ.12 వేలు అందిస్తున్నది.
– కిశోర్కుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్