గద్వాల, ఏప్రిల్ 17 : నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు లిఫ్ట్. గద్వాల, అంలపూర్ నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. 2014 ముందు నెట్టెంపాడ్ ప్రాజెక్టు ద్వారా కేవలం 20 వేల ఎకరాలకు సాగునీరు అందించగా.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎనిమిదేండ్లలో నెట్టెంపాడు ప్రాజెక్టుకు దాదాపు రూ.603 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కాలువలు అభివృద్ధి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడంలో భాగంగా పనులు పూర్తి చేసి ప్రస్తుతం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ విషయం తెలియక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ప్రజా సంగ్రామ యాత్రలో అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లను ప్రభుత్వం నింపుతుండడంతో సాగునీరు పుష్కలంగా అందుతున్నది. నెట్టెంపాడ్ ప్రాజెక్టుతో జోగుళాంబ గద్వాల జిల్లాలో 8 మండలాలు సస్యశ్యామలం అవుతున్నాయి. గద్వాల జిల్లా పచ్చబడడం చూసి బండి కళ్లు మండి పనికి మాలిన మాటలు మాట్లాడుతుండంతో నడిగడ్డ ప్రజలు నవ్వుకుంటున్నారు.
ప్రాజెక్టు వివరాలు ఇలా..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల రైతుల పొలాలకు నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా నీరు అందిస్తున్నారు. నెట్టెంపాడు పంపు ద్వారా ర్యాలంపాడ్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి 104 చెరువులు నింపుతున్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నెట్టెంపాడ్ లిఫ్ట్ను ఏర్పాటు చేసింది. లిఫ్ట్ పూర్తి అంచనా వ్యయం రూ.2400 కోట్లు. ప్రస్తుతం ఈ లిఫ్ట్ ద్వారా 1.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. 99,100 ప్యాకేజీ పనులు పూర్తయితే 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం ఆ రెండు ప్యాకేజీ పరిధిలోని పనులు చివరి దశకు చేరాయి. నెట్టెంపాడ్ పరిధిలో ఆయకట్టు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.21 కోట్లు విడుదల చేసింది. పనులు టెండర్ దశలో ఉన్నాయి.
తొండి సంజయ్ అవగాహన లేమి..
జిల్లాలో ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అవేవి తెలుసుకోకుండా అవగాహన లేమితో మాట్లాడడం చూస్తుంటే పిచ్చిపట్టినట్లు ఉన్నదని నడిగడ్డవాసులు చర్చించుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో సాగునీరు అందక రైతులు వలసలు వెళ్లేవారు. అయితే ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా అందడంతో పంటలు బాగా పండుతుండంతో కోతల సమయంలో ఇతర రాష్ర్టాల కూలీలు ఇక్కడికే వలసలు వచ్చి ఉపాధి పొందుతున్నారు. నెట్టెంపాడ్ పరిధిలో సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు పంటలు సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. జూరాల బ్యాక్వాటర్ కింద వరద సమయంలో రోజు 3 వేల క్యూసెక్కుల నీటిని 90 రోజులపాటు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు పొందుతూ పంటలు సాగు చేస్తున్న రైతుల సంబురం వారి మాటల్లో..
వానలొస్తేనే పంటలు
నెట్టెంపాడు ప్రాజెక్ట్ పూర్తి కాని సమయంలో కేవలం వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే వాళ్లం. వర్షాలు బాగా కురిస్తే పంట.. లేదంటే లేకుండే. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెట్టెంపాడ్ పూర్తి చేయడం ద్వారా సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ప్రస్తుతం రెండు పంటలు సాగు చేసుకుంటున్నాం.
– శ్రీనివాసులు, గట్టు,
నెట్టెంపాడు మాకు ప్రాణదాత
నెట్టెంపాడు లిఫ్ట్ రాక ముందు బోర్లు, బావులు, వర్షాధారంపై పంటలు సాగు చేసేటోళ్లం. ప్రస్తుతం నెట్టెంపాడ్ పనులు పూర్తి కావడంతో పాటు కాలువలు అభివృద్ధి చేయడంతో నీరు పుష్కలంగా పారుతున్నది. అందుకే నెట్టెంపాడు లిఫ్ట్ నడిగడ్డ ప్రాణదాతగా నిలిచింది. పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు పారుతున్నది.
– శేఖర్, మల్దకల్