మద్దూర్, ఏప్రిల్ 6: ‘మీ కష్టమే నా కష్టంగా భావించి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’ అని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఎక్కమేడ్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ‘మన ఊరు -మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తామని భరోసా కల్పించారు. అనంతరం తిమ్మారెడ్డిపల్లి వాగు బ్రిడ్జి సాకారం అయినందుకుగానూ బ్రిడ్జి వద్ద గ్రామస్తులు ఏఈ, డీఈ, ఎస్ఈ, ఎమ్మెల్యేతో కలిసి కేక్కట్ చేశారు. ఎన్నో ఏండ్ల కలను నిజం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల్లో ప్రారంభంకానున్న బావాజీ జాతరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
ఎల్లమ్మ తల్లి ఆలయాభివృద్ధికి సహకరించాలి
భక్తుల సౌకర్యార్థం ఎల్లమ్మ తల్లీ ఆలయంలో అదనపు గదులు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మతల్లీ ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ రాజేందర్రెడ్డి నాయకులు బుగ్గప్ప, యాదయ్య పాల్గొన్నారు.