అయిజ/రాజోళి, మే 25 : కరోనా కట్టడికిగానూ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, ప్రజలు ఉదయం పది గంటల వరకే ఇండ్లకు చేరుకోవాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ సూచించారు. మంగళవారం అయిజ మున్సిపాలిటీతోపాటు వెంకటాపూర్లో లాక్డౌన్ను పర్యవేక్షించారు. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, రాయిచూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. అలాగే రాజోళి మండల కేంద్రం శివారులోని సుంకేసుల డ్యాం వద్ద ఏర్పాటు చేసిన ఏపీ, తెలంగాణ చెక్పోస్టును పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యాపారస్తులు ఉదయం 6 నుంచి 9:45 గంటల వరకు విక్రయాలు జరపాలని, 10 గంటల్లోగా దుకాణాలు మూసివేయాలన్నారు. పది దాటితే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానా విధిస్తామన్నారు. పది గంటల తర్వాత ఈ-పాస్ లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్ పూర్తయ్యాకే విడుదల చేస్తామన్నారు. అనవసరంగా బయటకు రావొద్దన్నారు. వ్యవసాయ అవసరాలకు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించాలని పోలీసులకు సూచించారు. అయిజలో ఎస్పీ వెంట డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, ఎస్సై జగదీశ్వర్, ఏఎస్సై వెంకట్రాములు, రాజోళిలో ఇన్స్పెక్టర్ సూర్యానాయక్, సీసీఎస్ ఎస్సై నగేష్కుమార్, పోలీసులు ఉన్నారు.
అనవసరంగా బయటకు రావొద్దు
మల్దకల్, మే 25 : ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని ఎస్పీ రంజన్ రతన్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని లాక్డౌన్ను మంగళవారం ఎస్పీ పర్యవేక్షించారు. మల్దకల్ బస్టాండ్ వద్ద బైక్లపై తిరుగుతున్న వ్యక్తులను పిలిచి మందలించారు. అనవసరంగా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పుల్లూరు టోల్గేట్ పరిశీలన
ఉండవెల్లి, మే 25 : పుల్లూర్ టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళవారం ఎస్పీ రంజన్ రతన్కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతించాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యానాయక్, సీసీఎస్ ఎస్సై నాగేష్కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
విశ్రాంతి లేకుండా ప్రజాసేవలో..
వడ్డేపల్లి, మే 25 : కొవిడ్ నివారణలో భాగంగా చేపట్టిన లాక్డౌన్లో పోలీసులు విశ్రాంతి లేకుండా సేవలందిస్తున్నారు. తెల్లవారుజామున రోడ్లమీదకు వచ్చిన పోలీసులు సరైన సమయంలో భోజనం చేయడం లేదు. శాంతినగర్ ఎస్సై శ్రీహరి మంగళవారం జీపులోనే టిఫిన్ చేశారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్
గద్వాల, మే 25 : జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతున్నది. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ రంజన్త్రన్కుమార్ ఎప్పటికప్పుడు లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత బాధపడడం కంటే.. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి దరిచేరదని పోలీసులు సూచిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా అనాథలకు కౌన్సిలర్ దౌలు జిల్లా కేంద్రంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా.. మంగళవారం సీఐ మనుమంతు చేతుల మీదుగా అన్నదానం చేయించారు.
20 వాహనాలు సీజ్
అయిజ, మే 25 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలో నిబంధనలు అతిక్రమించిన 19 బైకులు, ఒక కారును సీజ్ చేసి రూ.19,600 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశామన్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు వాహనాలను ఇవ్వబోమని స్పష్టం చేశారు.
పకడ్బందీగా లాక్డౌన్
గట్టు, మే 25 : మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. దుకాణాలను పది గంటల కంటే ముందే మూసివేస్తున్నారు. ఎస్సై మంజునాథ్రెడ్డి లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు జరిమానా విధిస్తున్నారు.