అదనపు కలెక్టర్ శ్రీహర్ష
గద్వాల, ఫిబ్రవరి 5: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష వసతిగృహ నిర్వాహకులను ఆదేశించారు. జిల్లాలోని షెడ్యూల్డుకులాల, వెనుకబడిన తరగతులకు చెందిన పోస్ట్, ప్రీమెట్రిక్ వసతిగృహాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వసతిగృహాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసే భోజన సదుపాయాలు, నీటివసతి గురించి వసతిగృహ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాలకు సంబంధించిన పనులపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు సంబంధించిన గదులు, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వంటగది పరిసరాలు, వసతి గృహ ఆవరణలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లోని వసతిగృహ విద్యార్థులతో భోజనం, తాగునీరు ఇతర సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాల గురించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయని, వసతిగృహ పరిసరాలు పరిశుభ్రంగా లేవని ఇలాంటి సమస్యలు ఇకముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా షెడ్యూల్డు కులాల అధికారి శ్వేతాప్రియదర్శిని, మున్సిపల్ కమిషనర్ జానకిరాములు, పబ్లిక్ హెల్త్ ఏఈ నితిన్రెడ్డి తదితరులు ఉన్నారు.