జోగులాంబ గద్వాల : జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేస్తున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. జాతీయ వన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామంలోని జయలక్ష్మి అనే రైతు ఆరు ఎకరాల పొలంలో 320 ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. 2022-23 సంవత్సరానికి ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు టి.ఎస్ ఆయిల్ ఫెడ్ క్షేత్ర స్థాయి సిబ్బంది, డ్రిప్ కంపెనీల సిబ్బంది సహకారంతో 115 మంది రైతులు 500 ఎకరాల్లో ఒకే రోజు 25 వేల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు.
రైతులు ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేసుకోవాలంటే మొక్క పూర్తి ఖరీదు రూ.193 కాగా, రాయితీకింద రూ, 173 పోగా మిగిలిన రూ.20 రైతు వాటా డీ.డీ రూపంలో చెల్లించి గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమోదం పొందాలన్నారు. కార్యక్రమంలో డీఏవో గోవింద్ నాయక్, సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కృష్ణయ్య, ఉద్యాన శాఖఅధికారి సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.