గద్వాల, డిసెంబర్ 15: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తాసిల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, తాసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్ డేటా ఎంట్రీ పూర్తిచేసి ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షుణ్ణంగా స్క్రూటినీ నిర్వహించాలన్నారు. ఎన్నికల అధికారులు, సహాయ అధికారులు రోజువారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి లాగిన్లో పెండింగ్లో ఉన్నవాటిని పూర్తి చేసి పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో పేరు ఉండకుండా ఇంటింటికీ తిరిగి నిర్ధారణ చేసుకోవాలని, చెక్లిస్ట్ను రూపొందించుకొని బీఎల్వోలతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించాలన్నారు. జనాభా లెక్కల ప్రకారం 18ఏండ్లు పైబడిన వారిందరినీ ఓటరు జాబితాలో చేర్చాలని సూచించారు. ఓటరు జాబితాలో పుట్టిన తేదీ వివరాలు తప్పుగా ఉంటే వాటిని సవరించాలన్నారు. ఫారం-6,7,8 కి సంబంధించి పెండింగ్ ఉన్నవాటిని గరుడయాప్లో పర్సనల్గా చెక్చేసి బీఎల్వోలకు పంపించాలన్నారు. ఓటర్ల ఫొటోలు సరైన విధంగా లేకుంటే వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆర్డీవో రాములు, తాసిల్దార్లు పాల్గొన్నారు.
సర్వే పనులు పూర్తి చేయాలి
భారత్మాల జాతీయ రహదారి కోసం భూ సేకరణ చేసిన కేటిదొడ్డి, గట్టు, అరగిద్ద, యాపదిన్నె, వెంకటాపురం, నందిన్నె, తప్పెట్లమొర్సు, అయిజ, జడిదొడ్డి, బింగిదొడ్డి, వడ్డేపల్లి, రాజోళి మండలాల్లోని పలు గ్రామాల్లో భూముల సర్వే పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భారత మాల జాతీయ రహదారి భూముల సర్వే పెండింగ్ పనులు, చెల్లింపులపరంగా ఎవరెవరికీ ఎంత ఇవ్వాలి అనే ఆంశంపై తాసిల్దార్లు, సర్వేయర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్వే రిపోర్టు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాలు, గ్రామాల్లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న భారత్మాల ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేయాలన్నారు. రోడ్డు నిర్మాణంలో రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ పొలాలకు వెళ్లేదారిని ఏర్పాటు చేయాలన్నారు.
రైతులకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారత్మాల నిర్మాణం పనులు చేయాలన్నారు. నేషనల్ హైవే భారత్మాల ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లింపుల వివరాలను మండలాలవారీగా తాసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. సర్వేయర్లు సర్వే త్వరగా పూర్తిచేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. పొజీషన్ ఒకరు రికార్డులో వేరొకరు ఉన్నందున సర్వే రిపోర్టు అనుకున్న సమయంలో ఇవ్వలేకపోతున్నామని సర్వేయర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఒక తేదీ ప్రకారం నోటీసులు జారీ చేసి సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఏవో యాదగిరి, ఇరిగేషన్ అధికారులు ఖాజాజుబేర్ అహ్మద్, రహీముద్దీన్ పాల్గొన్నారు.