Anjaneya Goud : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావులపై దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని ఎటువంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆ పార్టీ కుట్రలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా ప్రాథమిక న్యాయ సూత్రాలు, నిబంధనలు పాటించలేదని హైకోర్టు తీర్పు పేర్కొన్నదని, దీంతో ఆ నివేదికకు చట్టబద్ధత లేదని తేటతెల్లమైందని ఆంజనేయ గౌడ్ వివరించారు. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు ఎలాంటి నోటీసులివ్వకుండా కేవలం ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం బహుళదశ సాగునీటి పథకంపై నిరాధారమైన కథలు ప్రచారం చేసి కేసీఆర్ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీయాలనే కుయుక్తితో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుకు చేపట్టవలసిన మరమ్మతులను సకాలంలో మొదలుపెట్టకుండా.. రెండున్నరేళ్లు ఆలస్యం చేసి, తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రారంభించారని ఆంజనేయ గౌడ్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్, హరీష్ రావులపై పీసీ ఘోష్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తాజా తీర్పుతో స్పష్టమైందని.. కాంగ్రెస్, బీజేపీ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రావాలని ఆంజనేయ గౌడ్ అన్నారు. అంతిమంగా న్యాయం, ధర్మమే గెలుస్తుందనే విశ్వాసానికి హైకోర్టు తీర్పు ప్రబల నిదర్శనమని, పాలకులకిది చెంపపెట్టు వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశించడంతో న్యాయం గెలిచిందని ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్యలు, వేధింపులు మానేసి.. పాలనపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, చక్రధర్ రావు, కోటేష్, ఆతుకూరి రెహమాన్, బీచుపల్లి, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, జగదీష్, చిత్తరి కిరణ్, దుబ్బన్న, నరసింహులు, కమ్మరి రాము, రామకృష్ణ, విజయ్ కుమార్, శ్రీనివాసులు, అఖిల్ రెడ్డి, రామాంజనేయులు, వీరేష్, మాలిక్, వెంకటేష్, రాముడు, కృష్ణ, రవి, రాజు, గోపాల్, మోహన్, పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.