బాధిత కుటుంబాలకు కొండంత భరోసా
జోగుళాంబ గద్వాలలో 1,656 మందికి లబ్ధి
రూ.82.80 కోట్లు అందజేత
గద్వాల, డిసెంబర్ 27 : రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటున్నది. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ చేదోడువాదోడుగా నిలుస్తున్నది. రైతుబంధు, నిరంతర ఉచిత విద్యుత్, రైతుబీమా, పుష్కలంగా సాగునీరు వంటివి అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేసేలా కృషి చేస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే రైతుల ముంగిటకు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నది. పెద్ద దిక్కైన రైతు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి..? అని ఆలోచించిన సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏ రకంగా మరణించినా రూ.5 లక్షల బీమా అందజేస్తూ బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. చనిపోయిన రైతును తిరిగి తీసుకురాలేకున్నా.. రైతు బీమా కింద నేరుగా నామినీ ఖాతాలో డబ్బు జమ చేస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. రైతుబీమా పథకంలో భాగంగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. రూపాయి చెల్లించకుండానే రూ.5 లక్షల బీమా అందుతుండడంతో బాధిత కుటుంబ సభ్యులు హాయిగా గడుపుతున్నారు. సమైక్య పాలనలో ఏ పథకమైనా మధ్యవర్తుల ప్రమేయంతో లబ్ధిదారులకు చేరుకునేది. ఎక్కువ శాతం వారు తీసుకొని అసలైనా వారికి కొంత మేర ఇచ్చేవారు. అయితే, రైతుబీమా పథకానికి సంబంధించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నామినీ ఖాతాలో పది రోజుల్లోనే డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. 2018 ఆగస్ట్టు 14న రైతుబీమా పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,656 మంది రైతు కుటుంబాలకు రూ.82.8 కోట్లు చెల్లించారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో 844 మందికి రూ.42.20 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో 812 మందికి రూ.40.60 కోట్లు పంపిణీ చేశారు. పట్టదార్ పాస్పుస్తకం ఉన్న 59 ఏండ్ల లోపు రైతులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. రైతుబీమా కోసం 1,29,642 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. 1,04,530 మందిని అర్హులుగా గుర్తించారు.