నిండు కుండల్లా చెరువులు, కుంటలు
శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం
ఏపీలో అధికంగా విద్యుదుత్పత్తి
ప్రచారం చేపట్టిన ఇరిగేషన్ శాఖ
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎంజీకేఎల్ఐ నీటి పంపింగ్ నిలిచిపోనున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోవడంతో వారం, పది రోజుల్లో రిజర్వాయర్లకు నీటి విడుదల ఆగిపోనున్నది. 9 నెలల నుంచి లిఫ్ట్లోని మోటర్లు నీటిని ఎత్తిపోశాయి. దీంతో నాగర్కర్నూల్జిల్లాలోని 1900 వరకు చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. యాసంగి సీజన్ తుది దశకు చేరుతున్న నేపథ్యంలో సాగు, తాగునీటికి ఇక్కట్లు లేకుండా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులకు నివేదించారు. గ్రామ స్థాయిలోనూ రైతులకు నీటి నిలిపివేతపై అవగాహన కోసం ముందస్తు ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంజీకేఎల్ఐ ఏర్పడిన నాలుగేండ్లలో 170 టీఎంసీలు సాగుకు అందించారు.
ఎంజీకేఎల్ఐ నుంచి వారంలోగా అధికారులు నీటి పంపింగ్ను నిలిపివేయనున్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్ నుంచి సింగోటం జలాశయంతోపాటు జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తుంటారు. గతేడాది వానకాలంలో జూలై 20వ తేదీ నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపుగా తొమ్మిది నెలల కాలం నీళ్లు వస్తూనే ఉన్నాయి. దీంతో జిల్లాలోని దాదాపు 1900 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికీ అతిపెద్దదైన నాగర్కర్నూల్ కేసరి సముద్రం అలుగు పారుతుండడం విశేషం. ఇలా నిరంతరంగా ఎంజీకేఎల్ఐ ద్వారా వస్తున్న నీరు మరో వారం రోజుల్లో నిలిచిపోనున్నాయి. శ్రీశైలంలో నీటి మట్టం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 215 టీఎంసీలు కాగా.. ఇప్పుడు కేవలం 34.1960 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గరిష్ఠ ఎత్తు 885 అడుగులకుగానూ 809.80 అడుగుల్లోనే నీళ్లు ఉన్నాయి. దీనికితోడు ఏపీ ప్రభుత్వం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేపట్టడంతో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి ఎంజీకేఎల్ఐకి నీటి విడుదలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో వచ్చే వారం, పది రోజుల్లో ఎల్లూరు నుంచి నీటి విడుదల ఆగిపోనున్నది. ఈ నేపథ్యంలో రైతులు యాసంగికి ముందస్తు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు కోరుతున్నారు. చెరువులు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో నీటితో నిండి ఉన్నాయి. ఈ నెల చివరి నాటికి 65 వేల ఎకరాలకు మించకుండా వరి సాగు చేసే అవకాశం ఉన్నది. దీంతో నీటి అవసరాలు యాసంగిలో అంతగా అవసరం ఉండదని అధికారుల అంచనా. వరి పంట వేయవద్దని రాష్ట్రం ఇచ్చిన పిలుపుతో జిల్లాలో 1.10 లక్షల అంచనాకు గాను 55 శాతం వరకు మాత్రమే సాగయ్యే అవకాశం ఉన్నది. జిల్లాలో ఈ సీజన్లో 3.09 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా.
ఆరుతడి పంటల సాగు ఎక్కువగా ఉండడంతో యాసంగికి సాగునీటి సమస్య లేనట్లే. దీనిపై కలెక్టర్తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు నీటిపారుదల శాఖ అధికారులు సమాచారం అందించారు. అయితే, గ్రామ స్థాయిలోనూ రైతులకు నీటి నిలిపివేత విషయాన్ని తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంజీకేఎల్ఐ ద్వారా జిల్లా ఏర్పడిన నాలుగేండ్లల్లో 170 టీఎంసీలు సాగు భూముల్లో ప్రవహించాయి. దాదాపుగా ఎనిమిది, తొమ్మిది నెలలపాటు నిరంతరంగా కృష్ణా జలాలను కొల్లాపూర్ నుంచి కల్వకుర్తి వరకు తరలించిన ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పంపులు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ జిల్లా ఈఈ సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ఏపీలో అధిక విద్యుదుత్పత్తికి తోడు వర్షాకాలం ముగియడంతో శ్రీశైలానికి ఇన్ఫ్లో నిలిచిపోయిందన్నారు. ఈ కారణంగా ఎత్తిపోతల ద్వారా నీటి పంపింగ్ నిలిపివేస్తున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.