ఎస్పీ వెంకటేశ్వర్లు
నారాయణపేట, ఫిబ్రవరి 12: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలను వినియోగించినా, సరఫరా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఊట్కూర్ మండలంలోని ఓ వ్యక్తి గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడగా, ఆ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల నుంచి మల్లేపల్లి స్టేజీకి వస్తున్న ఓ ప్యాసింజర్ఆటోలో రాజు అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మల్లేపల్లి స్టేజీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, పోలీసులను గమనించిన రాజు పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు రాజును పట్టుకొని తనిఖీ చేయగా 8 గంజాయి ప్యాకెట్లు దొరికినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు ఎక్కడినుంచి తెచ్చావని విచారణ చేయగా ఎడివెల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ తనకు ఈ ప్యాకెట్లు ఇచ్చి విక్రయించమన్నాడని పోలీసులకు తెలిపాడన్నారు. దీంతో పోలీసులు ఎడివెల్లి గ్రామంలోని వెంకటేశ్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి 320 గ్రాముల పొడి గంజాయి, 8 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఊట్కూర్ తాసిల్దార్ తిరుపతయ్య పంచనామా అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 20వేలు ఉంటుందని చెప్పారు. గత 3 ఏండ్లుగా జిల్లాలో గంజాయిసాగు, సరఫరా జరిగినట్లు రికార్డులో లేదని, అయినా టాస్క్ఫోర్స్ విభాగాన్ని అప్రమత్తంగా చేసినట్లు పేర్కొన్నారు. ఊట్కూర్, నారాయణపేట ప్రాంతాలలో కొంత మేర గంజాయి మొక్కలను పెంచి హైవేలపై వెళ్లే లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు సమాచారముందన్నారు.
మత్తుపదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు.