అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజ
ఇటిక్యాల, ఫిబ్రవరి 13: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో 70ఏండ్లుగా జరుగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో కేవలం అయిదేండ్లలో జరిగిందన్నారు. అలాగే గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో కరోనా ప్రభావంతో ఆర్థిక ముప్పు ముంచుకొచ్చినా.. రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ పథకాలు నిలిచిపోలేదన్నారు.
నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి పరితపించే ముఖ్యమంత్రి ఆలోచనలతో రాష్ట్రంలో గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలువనున్నాయన్నారు. ఈ సందర్భంగా చాగాపురంలో రూ.30లక్షలు, షాబాదాలో రూ.20లక్షలు, వేములలో రూ.15లక్షలు, శనిగపల్లె, బట్లదిన్నె, ఉదండాపూర్, సాతర్ల, వావిలాల, శివనంపల్లె, ఎంఆర్చెరువు, గోపల్దిన్నె, నక్కలపల్లె, బుడ్డారెడ్డిపల్లెలో రూ.5లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణాలకు భూమిపూజ చేశారు.
అనంతరం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హన్మంత్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయచంద్రారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.