గద్వాల,ఆగస్టు 6 :వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దుదేకుల, రజక, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా తీసుకుని జీవనం సాగిస్తున్నాయి. గద్వాల జరీ చీరలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా కాక విదేశాల్లో సైతం గద్వాల చీరకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గద్వాల డివిజన్లో గద్వాల, అనంతపురం, కుర్వపల్లి, కాకులారం, ధరూర్, గట్టు, మాచర్ల, ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి, మల్దకల్, బూడిదపాడు, నాగర్దొడ్డి, అలంపూర్, రాజోళి, ఎక్లాస్పురం, అయిజ ప్రాంతాలలో దాదాపు 6948 పైగా కుటుంబాలు చేనేత వృత్తిపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధిని పొందుతున్నాయి.చేనేతకార్మికులకు ప్రభుత్వం చేయూత నిస్తుండడంతో కార్మికులు తమ పూర్వ వృత్తి వైపు తిరిగి వచ్చి చీరలు నేస్తూ ఉపాధి పొందుతున్నారు.గద్వాల చేనేత కార్మికులకు వీవింగ్,డిజైనింగ్ విభాగంలో కొండాలక్ష్మణ్ బాపూజి అవార్డులకు ఎంపిక కావడం చూస్తుంటే ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యం ఎలాంటిదో తెలిసిపోతుంది.ఒక నాడు సడుగులు విరిగి సాలే మగ్గం నేడు ప్రభుత్వ చేయూతతో పూర్వవైభం సంతరించుకుంది.అందుకు కారణం ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత బీమా,త్రిఫ్ట్పథకం.చేనేత కార్మికుల కోసం విదేశి విద్యానిధి పథకం ఇలా అనే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుండడంతో వారు ఉపాధి పొందడంతో పాటు కనుమరుగువుతున్న చేనేత వృత్తిని కాపాడుతున్నారు.
గతమెంతో ఘనం..
గద్వాల చీరలకు దాదాపు 300ఏండ్లు దాటినట్లు చరిత్ర చెబుతున్నది. గద్వాల జరీ చీరల స్థానం సుస్థిరం. ఈ చీరల ప్రస్థానం ఈ నాటిది కాదు. సంస్థానాధీశుల కాలంలోనే గద్వాల చేనేతకు ప్రత్యేక స్థానం ఉన్నది. నాటి రాజుల ప్రోత్సాహంతో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంది. అగ్గిపెట్టెలో పట్టుచీర మలిచిన అద్భుత కళానైపుణ్యం మన నేతన్న సొంతం. వీరు నేచిన చీరలకు ఎల్లలు దాటిన ప్రాశస్త్యం. గత ప్రభుత్వాలు నేతన్నలను పట్టించుకోకపోగా.. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో హస్తకళలకు ప్రోత్సాహం కరువైంది. దీంతో నేతన్నలు ఇతర పనులపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేతన్నకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. వారికి రుణమాఫీ, చేనేత బీమా పథకం ప్రవేశపెట్టడంతో నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి చేతి నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మ చీరలను తయారు చేయిస్తున్నది. వారసత్వ సంపదను కాపాడేందుకు చేనేత, ఖద్దర్ దుస్తులు ధరించి చేనేతకు చేయూత నివ్వాల్సిన అవసరం అందరిపై ఉన్నది.
‘చేనేత’కు రాష్ట్రస్థాయి పురస్కారాలు..
చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ చేనే త దినోత్సవం సందర్భం గా చేనేత జౌళీశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్బాపూ జీ రాష్ట్రస్థాయి పురస్కారాలను అందిస్తున్నది. ఈ పురస్కారాల కు ఉమ్మడి జిల్లా నుంచి 10మంది ఎంపికయ్యారు. జోగుళాంబ గద్వా ల జిల్లా నుంచి ఆరుగురు, వనపర్తి జిల్లా నుంచి ఇద్దరు, నారాయణపేట నుంచి ఒకరు, మహబూబ్నగర్ నుంచి ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో గద్వాలకు చెందిన గోపాలకృష్ణ, అక్కల శాంతారం, కదిరు భాను, శిరీష, అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళికి చెందిన దర్జి వీరేశ్, గట్టు మండలం గొర్లఖాన్దొడ్డికి చెందిన వెంకటేశ్వర్లు ఉన్నారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన పోతు రా ధ, మహంకాళి బాలస్వామి, నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన గంజి మనెమ్మ, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బసవాయిపల్లికి చెందిన మంజుల ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వీరికి పురస్కారాలు అందించి రూ.25వేల నగదు, ప్రశంసాపత్రంతోపాటు శాలువాతో సత్కరించనున్నారు.
నేతన్నకు దక్కిన గౌరవం..
నాకు వచ్చిన అవార్డు చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా భావిస్తా. తెలంగాణ ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికులకు పూర్వవైభవం వచ్చింది. వీవింగ్ విభాగంలో నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. డైమండ్ డిజైన్తో నేచిన చీరకు నాకు అవార్డు వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో చేనేతకు మంచిరోజులొచ్చాయి. నేత పనిలో నైపుణ్యానికి అవార్డు రావడం సంతోషంగా ఉంది. – అక్కల శాంతారాం
సంతోషంగా ఉంది..
నేను నేచిన చీరను గుర్తించి నాకు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం గర్వంగా అనిపిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత కార్మికులకు దక్కిన గౌవరంగా భావిస్తున్నా. గత ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఇలా ఎప్పుడూ చేయూతనివ్వలేదు. ప్రత్యేకమైన డిజైన్తో చీర నేశాను. 12 ఏండ్లకు పైగా ఇదే వృత్తిలో కొసాగుతున్నా. కొత్త డిజైన్లో చీరలు నేయడమంటే నాకు చాలా ఇష్టం. చీర బార్డర్కు రథం ఏనుగులు ఉండే చీరను నేశాను. దీని విలువ సుమారు రూ70వేలు. కర్ణాటక వారు ఆర్డర్ ఇస్తే ఈ చీరతోపాటు మరో 10 చీరలు మగ్గంపై నేస్తున్నాం. ఇతర చీరలు రూ.17వేలకు ఇస్తున్నాం. నాకు అవార్డు వచ్చిన చీర నేయడానికి 30 రోజుల సమయం పట్టింది. – శిరీష, రాఘవేంద్రకాలనీ, నేత కార్మికురాలు
సుమారు 30 ఏండ్లుగా డిజై న్ రంగంలో పని చేస్తు న్నా. తెలంగాణ ప్రభు త్వం నా సేవలు గుర్తిం చి డిజైనింగ్ విభాగం లో అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు రావడంతో నా జన్మ ధన్యమైం ది. గద్వాల జరీ సిల్క్ చీర లో ఫుల్ టర్నింగ్ బార్డర్ కుట్టు డి జైన్కు అవార్డు లభించింది. ఉమ్మడి జిల్లాలో చాలామంది చేనేత కార్మికు లు నా వద్ద డిజైన్లు తీసుకొని చీరలు నేస్తున్నారు. బతుకమ్మ టీవీ వారు ప్రతి ఏడాది కార్తీకమాసంలో నిర్వహించే కార్యక్రమంలో అతిథులకు వేసే శాలువాలకు డిజైన్ నేనే తయారు చేసి ఇచ్చా. ప్రస్తుతం సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా డిజైన్కు గుర్తింపు వచ్చింది. – గోపాలకృష్ణ, వేదనగర్