ఆయిల్పాం సాగు ఆదాయ వనరుగా మారింది. వంట నూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020-21 ఏడాదిలో 85 మంది రైతులు 252 ఎకరాల్లో మొదటి విడుతగా తోటలను సాగు చేశారు. నేడు ఆ చెట్లకు గెలలు రాగా కొందరు కత్తిరించారు.
మరికొందరు అలాగే ఉంచడంతో కోత దశకు వచ్చాయి. జూలైలో వీటిని కత్తిరించేందుకు అన్నదాతలు సిద్ధమవుతుండగా.. కొనుగోలు చేసేందుకు అధికారులు మల్దకల్, బీచుపల్లి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్లో రూ.14,728 టన్ను ధర పలకగా.. అంతర్జాతీయ మార్కెట్ ధరల మేరకు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇటిక్యాల, ఏప్రిల్ 26 : రైతులను లాభాల బా ట పట్టించేందుకు, ప్రత్యామ్నాయ సాగు వైపు దృ ష్టి సారించేందుకు ప్రభుత్వం ఆయిల్పాం సాగు ను ప్రోత్సహిస్తున్నది. వంటనూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించేందుకుగానూ జోగుళాం బ గద్వాల జిల్లాలో సాగుచేసిన ఆయిల్పాం తోట ల్లో గెలలు వచ్చాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జూలైలో కోతలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020-21లో 65 మంది రైతులు 252 ఎకరాల్లో మొదటి విడుతగా ఆయిల్పాం తోటలను సాగు చేశారు. 20 21-22లో 356 మంది రైతులు 1,479 ఎకరా లు, 2022-23లో 723 మంది.. 2,862 ఎకరా ల్లో పంటలు వేశారు. అయితే, మొదటి విడుతగా సాగుచేసిన రైతుల్లో చెట్లు పెరగదని కొంతమంది గెలలు కత్తిరించగా.. చాలా మంది రైతులు మొదటి గెలను అలాగే ఉంచారు. గెలలను అలాగే ఉంచిన తోటల్లో జూలైలో కోతలు చేపట్టనున్నారు. కోత చేసిన గెలలను సేకరించేందుకు మల్దకల్ మండలకేంద్రంలో, ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఉన్న విజయవర్ధిని ఆయిల్మిల్లు వద్ద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలలో ట న్ను గెల రూ.14,728గా ఉన్నదని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గెలలో ఆయిల్ రికవరీని బట్టి రైతులకు ధర చెల్లించనున్నారు. కొనుగోలు చేసిన గెలలను ప్రాసెసింగ్ చేసేందు కు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని విజయవర్ధిని ఆయిల్మిల్లుకు తరలించనున్నారు.
నిరుద్యోగ యువతకు శిక్షణ..
జిల్లాలో కొత్తగా సాగుచేసిన ఆయిల్పాం తోట ల్లో గెలల కత్తిరింపునకు గానూ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న యువతకు అశ్వరావుపేటలో 10 నుం చి 15 రోజులపాటు కోతలపై ప్రత్యేక శిక్షణ ఇ వ్వనున్నారు. దీంతో రైతులకు కూలీలు అందుబాటులో ఉండడమే కాకుండా.. యువతకు ఉపాధి కూడా దొరకనున్నది.
వచ్చే ఏడాది బీచుపల్లి మిల్లు ప్రారంభం..
ఒకప్పుడు ఆసియా ఖండంలో పేరెన్నిక గాం చిన బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్మిల్లు ఉమ్మడి పాలనలో మూతపడింది. స్వరాష్ట్రంలో జిల్లాలో ఆయిల్పాం సాగు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆయిల్మిల్లును పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం పూనుకున్నది. ఆ దిశగా ఈ ఆయిల్మి ల్లు పరిధిలోని నారాయణపేట, జోగుళాంబ గ ద్వాల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆయిల్పాం సాగు చేపడుతున్నది. ప్రస్తుతం జిల్లాలో 4,593 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతున్నది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కలిపి 10 వేల ఎకరాలకు చేరువలో ఉన్నది.
ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి..
జిల్లాలో మొదటి విడుతగా సాగుచేసిన ఆయిల్పాం తోటల్లో ప్రస్తుతం గెలలు వచ్చాయి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. గెలలను రైతుల వద్ద కొనుగోలు చేసేందుకు బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్మిల్లు, మల్దకల్ మండలంలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. అక్కడ కొనుగోలు చేసి వాటిని ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు తరలిస్తాం. ఈ ప్రాంత యువకులకు గెలలు కోసేందుకుగానూ శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.
– వెంకటేశ్, డిప్యూటీ మేనేజర్, బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్మిల్లు
ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం..
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆయిల్పాం తోటల పెంపకంపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. ముఖ్యంగా నీటి యాజమాన్యంపై క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పంట దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఆయిల్పాం సాగుపై రైతుల నుంచి స్పందన వస్తున్నది. రానున్న రోజుల్లో సాగు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.ఈ నెలలో టన్ను గెల రూ.14,728గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గెలలో ఆయిల్ రికవరీని బట్టి రైతులకు ధర చెల్లించనున్నాం.
– రాజశేఖర్, ఉద్యానవన శాఖ అధికారి