రెవెన్యూ శాఖలో లంచావతారులు పుట్టుకొస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే నలుగురు రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కారు. ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన ధరణి ప్రక్షాళనతోనూ అధికారుల తీరు మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరైనా పనులు చేసేందుకు ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అయితే కొందరు అక్రమ అధికారులతో శాఖకే చెడ్డపేరు వస్తున్నది.
– నారాయణపేట, సెప్టెంబర్ 28
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బింగి వెంకటప్ప గత నెల 21వ తేదీన నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మరునాడే ఆయనకు నాలా సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ, దానిపై స్టాంప్ లేకపోవవడంతో తాసిల్దార్ను సంప్రదించాడు. రూ.10 వేలు ఇస్తే స్టాంప్ వేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గత సోమవారం రూ.5 వేలు లంచం ఇస్తుండగా తాసిల్దార్ వెంకటేశ్ను ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
దేశంలో ఏ రా ష్ట్రంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో స మానంగా తెలంగాణలో జీతాలు ఇస్తున్నా.. కొంత మంది ఉద్యోగులు లంచాలు తీసుకోవడం మాత్రం ఆపడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంటే రెవెన్యూ లో ఎక్కువ అవినీతి జరుగుతున్నది. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరగాలని సీఎం కేసీఆర్ ధరణి ద్వారా రెవె న్యూ రికార్డులను ఆన్లైన్ చేయించడం, వీఆర్వో వ్య వస్థను రద్దు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టా రు. అయినా లంచావతారులు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నారు. కాసులు దండుకుంటున్నారు.
కేవలం ఎనిమిది నెలల్లోనే నారాయణపేట జిల్లా లో నలుగురు రెవె న్యూ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. కాగా, పట్టా పాస్ పుస్తకాలను సరిచేసేందుకు ఇబ్బందులకు గురిచేయడంతో చేసేదేమీలేక కలెక్టరేట్ ఎదుటే రైతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటనలు కూడా ఉన్నాయి. మద్దూరు మండలం రెనివెట్ల గ్రామానికి చెందిన మాల చిన్నకాశప్ప మృతి చెందగా.. ఆయన మొదటి భార్యపై కాకుండా రెండో భార్యపై విరాసత్ చేశారు. దీంతో మొదటి భార్య కనకమ్మ, ఆమె సోదరుడు కలిసి ఈ నెల 23వ తేదీన మద్దూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఇలా ఒక వైపు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూనే.. మరోవైపు లంచాలు ఇస్తేనే పనులు చేస్తామంటున్నారు. ఇలా కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల కారణంగా ఆ శాఖకే చెడ్డ పేరు వస్తున్నది.
కాసుల కోసం కక్కుర్తి..