మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘం టీజీవో అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘం భవన నిర్మాణానికి కలెక్టర్ రవినాయక్, టీజీవో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న రాష్ర్టాలు ఏర్పడితేనే పరిపాలన సులభంగా ఉంటుందనే ఆలోచనతో తెలంగాణ కోసం అన్ని సంఘాలు ఏకమై పోరాటం చేశాయన్నారు. ఇది చూసిన నాటి ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచి మీ హౌసింగ్ సొసైటీకి 250 ఎకరాలు ఇస్తా.. జూబ్లీహిల్స్లో ఎకరం స్థలం భవనం కోసం కేటాయిస్తామని ఆశ చూపారని గుర్తు చేశారు. ఇక కిరణ్కుమార్రెడ్డి అయితే మీకేం కావాలన్నా తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చారని, కానీ మేము వాటిని తిరస్కరించామని, మాకు తెలంగాణ రాష్ట్రమే కావాలని ఖరాఖండిగా చెప్పామన్నారు. రాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వంతో కలిసి ఉంటూనే పీఆర్సీ తెచ్చుకోవడంలో, 40 వేల మందికి ప్రమోషన్లు ఇప్పించడంతో కీలక పాత్ర పోషించామని తెలిపారు. ఎక్కువ జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా, ఎక్కువ పథకాలు అమలు చేస్తున్న రాష్ర్టంగా తెలంగాణ దేశంలోనే ఖ్యాతి గడించిందన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకుంటున్న సంఘం టీజీవో అన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి ఇక్కడికి టూరిస్టులు వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐమాక్స్ వంటి థియేటర్లు, వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన కడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సెంట్రల్ కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు పునరుద్ధ్దరణ పనులకు శంకుస్థాపన..
పాలమూరు, మే 12 : పట్టణంలోని డైట్ కళాశాల నుంచి పిల్లలమర్రి వరకు రూ.1.57కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పునరుద్ధ్దరణ పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు. రానున్న రోజుల్లో పట్టణ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్, ఆర్అండ్బీ ఈఈ స్వామి, డిప్యూటీ ఈఈ సంధ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కాంట్రాక్టర్ విజయమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 12 : పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన వద్ద రూ.3.50కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి కృతజ్ఞతలు..
ఈ ఏడాది ఫిబ్రవరి 4న గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొని న్యూప్రేమ్ నగర్కు చెందిన మోబిన్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు జనరల్ దవాఖానకు తరలించారు. మోబిన్ చనిపోతాడని బంధువులు దవాఖానలోనే వదిలేసి వెళ్లిపోగా, కౌన్సిలర్ కిశోర్ అంబులెన్స్లో హైదరాబాద్ తరలించి మంత్రి శ్రీనివాస్గౌడ్కు సమాచారం అందించడంతో చికిత్స కోసం రూ.2.50లక్షల ఎల్వోసీ అందించి ఖర్చులకు ఆర్థికసాయం చేశారు. మోబిన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా మోబిన్ మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి ప్రాణాలను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.