నారాయణపేట, మార్చి 1 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 90శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని ప్రజలకు చూయించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవిపల్లికి వెళ్తున్నారని, పూర్తయిన పనులను చూయించాలని కోరుతున్నామన్నారు. కరివెన, వట్టెం ఇతర పంపుహౌస్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయని, కాల్వల నిర్మాణానికి టెండరు ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు.
కాల్వలు తవ్వితే 6 నెలల్లోనే పాలమూరు జిల్లాలోని ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తయిన రిజర్వాయర్లను వదిలిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు లక్ష్మీదేవిపల్లికి వెళ్తున్నారని విమర్శించారు. నారాయణపేట-కొండగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండేండ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారని, దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ పాలమూరు పథకానికి బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పాలమూరు ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతుల సంక్షేమాన్ని కోరుతున్నా పాలమూరు ఎత్తిపోతల కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.