మక్తల్ : ఓటరు జాబితా ( Voter lists ) లో ఖచ్చితత్వాన్ని పెంచి, అర్హులైన పౌరుల పేర్లు మాత్రమే నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) డిమాండ్ చేశారు. కొందరు అధికారులు కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మక్తల్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బూత్ స్థాయి అధికారులను కిరాణా షాపులో కూర్చోపెట్టుకొని ఎన్యూమారేషన్ ఫారాలను రాస్తున్న విషయా న్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. తహసీల్దార్ సతీష్ కుమార్ను సంఘటన స్థలానికి పిలిపించి అధికారుల తీరుపై మండిపడ్డారు.
ఓటర్ సవరణ కార్యక్రమాన్ని అధికారులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఓటర్కు పూర్తి అవకాశం కల్పించడంతోపాటు, న్యాయమైన విధానంలోనే సవరణలు జరగాలని అధికారులకు సూచించారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా, ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండే విధంగా బీఎల్వోలు విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా బిఎల్వోలు విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.