ఊట్కూర్/నర్వ, మే 20 : రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం నర్వ మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలం వద్ద ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని ఆయ న పరిశీలించారు. సెంటర్లో రైతులకు అందుతున్న సౌకర్యాలు, కొనుగోలు విధాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ధాన్యం వాహనాలను రోడ్లపై రోజుల తరబడి నిలబెట్టడం, సంచులకు రూ.15 ట్రాన్స్పోర్ట్ చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారని కొందరు రైతులు చిట్టెం దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో సీఈవో ఉదయ్ను ఆయన నిలదీశారు. రైతుల నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని, ట్రాక్టర్ యజమానులకు రవాణా బాధ్యతలు ఇస్తే వారికి కొంత ఆదాయం వచ్చేదన్నారు. రైతులకు భరోసా కల్పించాల్సిందిపోయి వారిపై ప్రభుత్వం అదనపు భారం మోపడం సరికాదన్నారు. రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆగ్రహం చెందారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మండలంలో ధాన్యం నిలువల కోసం గోదాంల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు.
ప్రసుత్త సర్కారు ధాన్యం నిల్వల విషయంలో ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. నర్వలో గోదాంలు ఉన్నా నిల్వలకు ఇబ్బందులు సృష్టించి కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మండలంలో దాదాపు 35 వేల మెట్రిక్ టన్నుల మక్కను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. వేగంగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ట్రాన్స్పోర్ట్ పేరుతో రైతులపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, సీనియర్ నాయకులు అయ్యప్ప, శేఖర్ యాదవ్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.