మదనాపురం, మార్చి 21 : సరైన సమయానికి వ్యవసాయానికి విద్యుత్, సాగునీరు ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఎకరాకూ రూ.10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దంతనూరుకు చెందిన గట్టన్న, పెద్ద చెన్నయ్యతోపాటు పలువురు రైతులు వరి సాగు చేయగా ఎండిపోవడంతో గురువారం మండల నాయకులతో కలిసి ఆల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులు గోస పడుతున్నారని వాపోయారు. సొంత పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలాల్లో రూ.వేలు ఖర్చుపెట్టి వరి పంట వేసుకున్న కర్షకులకు గోస తప్పడం లేదన్నారు. విద్యుత్, సాగునీరు లేక పంట పూర్తిగా ఎండిపోవడంతో గొర్రెలు, పశువులు మేయడానికి విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న కరువు పరిస్థితిలు మళ్లీ పాలమూరు జిల్లాలో కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన మార్పు అంటే ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. రైతుల కడుపుకొట్టడానికి, వారిని నిండా ముంచడానికే రేవంత్ ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తారు. రూ.10 వేల రైతుబంధు వద్దు డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసాలో భాగంగా రూ.15 వేలు ఇస్తామన్న నేతలు ఇప్పుడెక్కడ ఉన్నారని నిలదీశారు. పాత రైతుబంధు డబ్బులే రైతులకు నేటికీ సక్రమంగా ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాట తప్పడంలో సిద్ధహస్తులు కాంగ్రెస్ నాయకులు, ఎన్ని
కల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పథకాన్ని అటకెక్కించారని, దీంతో తాగునీటికి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతమని చెప్పారు. నేడు రాష్ర్టాభివృద్ధిని మరిచి కేసీఆర్ను తిట్టడం, గత ప్రభుత్వంపై అభాండాలు మోపడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ కన్న గొప్పగా ప్రజలకు సేవ చేయాలనే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు రైతులకు చేస్తామన్నా.. నేటికీ ఆ ఊసెత్తడం లేదన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామన్నా ఒక్కటీ అమలు చేయడం లేదని విమర్శించారు. అమలుకాని హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని, రాష్ట్ర ప్రజలను నిండా ముంచి చేతులెత్తేసి కూర్చున్నారని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా వారి మాయమాటలను గుర్తించి కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు. వచ్చే ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఆలోచించి ప్రజలు శ్రేయస్సుకోరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అసమర్థ పాలనతో నేడు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు గట్టన్న మాట్లాడుతూ కరెంట్, సాగునీరు లేక రెండెకరాల్లో సాగైన పంట పూర్తిగా ఎండిపోయిందని, దీంతో మేకలకు వదిలేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు డబ్బులు, పెట్టుబడి దాదాపుగా రూ.50 వేలు నష్టపోయానని అన్నారు. ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, బీఆర్ఎస్ దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రావణ్కుమార్రెడ్డి, ప్రశాంత్, మాజీ జెడ్పీటీసీలు విశ్వేశ్వర్, బాలమణెమ్మ, విండో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, నాయకులు బాలకృష్ణ, ప్రవీణ్రెడ్డి, తిరుపతయ్య, వెంకటేశ్, శ్రీనివాసులు, మాసన్న, రమేశ్, శివశంకర్, రవికుమార్, రాంచందర్ ఉన్నారు.