మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 2 : ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించినప్పుడే తాము అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విష్ణు కన్వెన్షన్ హాల్లో వ్యక్తిత్వ వికాస సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొనే సమయంలో సెల్ఫోన్, సినిమాలు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు.
పిల్లలు తమ చదువును నిర్లక్ష్యం చేస్తూ సామాజిక మాధ్యమాలవైపు ఆకర్షితులవుతున్నారని అలాంటి విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. తమ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చి వారిని నిరుత్సాహ పర్చవద్దని, వారిలోని ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఉన్నత చదువు చదివి సమాజానికి సేవచేయాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో రావాలన్నారు.
గొప్ప చదువులు చదివించి ఉద్యోగం వచ్చాక.. తమ తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలకు పంపుతున్నారని, అలాంటి పనులు ఎవరూ చేయవద్దని ఆయన వారికి సూచించారు. మహబూబ్నగర్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రతిపక్షంలో ఉన్నా జిల్లా అభివృద్ధి గురించే ఆలోచిస్తాంటామని తెలిపారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలను ప్రజలు ఒకేసారి నమ్ముతారని.. నిజం తెలుసుకొని మళ్లీ మావెంటే ఉంటారన్న నమ్మకం మాకుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.