జడ్చర్లటౌన్, నవంబర్16 : చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగంగా బీసీ జాగృతిసేన, బీసీ జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జడ్చర్లలో సామాజిక న్యాయం ధర్మదీక్ష చేపట్టి, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మద్దతు తెలిపారు. అంతకు ముందు సంతకం కూడా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీల పరంగా రిజర్వేషన్లు అంటే సరైంది కాదని, చట్టబద్దంగా బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియ మొదలైతే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ పడుతుందన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చట్టపరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తోందని ప్రకటించారు. బీసీల ధర్మ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్, పిట్టల మురళి, ప్రణీల్చందర్, శ్రీకాంత్, రఘునందనాచారి, వెంకటేశ్, ఉమాశంకర్గౌడ్, నడిమింటి శ్రీనివాస్, వెంకటేశ్, నిరంజన్, నర్సింహులు, శేఖర్, శ్రావణ్కుమార్, శివరాములు, గోపాల్, మాధవి, రాధిక, శివాని, శ్రవంతి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.