కల్వకుర్తి రూరల్, ఫిబ్రవరి 10 : ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీయే తప్పా ప్రజా సంక్షేమానికి పాటుపడేలా ఏ ఒక్క ప్రకటన లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ విమర్శించారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పా చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. అప్పుల రాష్ట్రంగా మార్చారని చెబుతున్న మీరు 60 రో జుల్లోనే 9వేల కోట్లు అప్పులు ఎందుకు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉన్నత హోదాలో ఉండి అసభ్యపదాలతో విమర్శలు చేయడం సిగ్గుచేటని, పనికిమాలిన మాటలు మాని పాలనపై దృష్టి సారించాలన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించేందుకు సిద్ధపడిన కేసీఆర్ను ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. ఇకనైనా సోయి తెచ్చుకొని ప్రజా సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈనెల 12వ తేదీన కల్వకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జిల్లా ఇన్చార్జి గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతోపాటు పలువురు హాజరవుతున్నారన్నారు. 13న నల్లగొండ సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చలో నల్లగొండ కార్యక్రమ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, వైస్ చైర్మన్ షాహెద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్గౌడ్, నాయకులు లాలయ్యగౌడ్, ఈశ్వరయ్య, బాలయ్య, రాంరెడ్డి, చెన్నకేశవులు, ఎల్ఎన్ రెడ్డి, జంగ య్య తదితరులు పాల్గొన్నారు.