మూసాపేట, ఫిబ్రవరి 2 : ఆటో డ్రైవర్లు ఎవరూ అధైర్యపడొద్దని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం కోప్యానాయక్తండాకు చెందిన పలువురు హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాము 15ఏండ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ పిల్లలను చదివిస్తూ జీవనం సాగిస్తున్నామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో తమకు బతు కు దెరువు లేకుండా పోయిందని, రోజురోజుకూ బతుకులు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రతినెలా చీటీలు, ఆటో కిస్తులు, పిల్లల ఫీజులు తమకు మోయలేని భారంగా మారాయని తమకు బతుకు భరోసా కల్పించేందుకు కృషి చేయాలని ఆటో డ్రైవర్లు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే హైదరాబాద్లో ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని, అందరికీ న్యా యం జరిగేందుకు, మీ సమస్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని ఎవరూ అధైర్యపడొద్దని వారికి ధైర్యం చెప్పారు.