ఊటూర్, ఆగస్టు 4 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని అఖిలపక్షం నాయకులు అరవింద్కుమార్, భాస్కర్, వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఊట్కూరు మండల కేంద్రంలో భూనిర్వాసితులకు మద్దతుగా వారు మీడియాతో మాట్లాడారు. కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కడుపు నింపి.. కర్షకుల పొట్ట కొడుతోందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పనులను మెఘా కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్కు అప్పగించిన ప్రభుత్వం రైతులను భయబ్రాంతులకు గురిచేసి పోలీసుపహారాలో భూ సేకరణ సర్వేను పూర్తి చేసిందన్నారు.
కాగా, ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు భూ పరిహారం అందించడంలో తీవ్రమైన అన్యాయానికి గురి చేసిందన్నారు. రైతుల న్యాయమైన హకుల కోసం పోరాడేందుకు పార్టీలకతీతంగా సిద్ధమైనట్లు తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని ఏ గ్రామాలకు సాగు నీటిని అందిస్తారో? స్పష్టమైన హామీ ఇవ్వకుండా కేవలం కొడంగల్కు సాగు నీటిని తరలించేందుకు సీఎం రేవంత్రెడ్డి రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ నష్టపరిహారం అందించడంలో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలవంతపు భూసేకరణకు పాల్పడిన ప్రభుత్వం నెల రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని వివిధ మార్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదన్నారు. పరిహారం పెంచమని అడుగుతున్న రైతులను నారాయణపేట ఆర్డీవో అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. భూ నిర్వాసితులకు కేవలం ఎకరాకు రూ.14 లక్షల పరిహారం అందిస్తోందని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారంతో బాధిత రైతులు మారెట్లో అర ఎకరా భూమి కూడా దొరకదన్నారు. నిర్వాసితులకు సరైన పరిహారం ఇప్పించడంలో మంత్రి శ్రీహరి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
మక్తల్ రైతులకు చెంతనే కృష్ణమ్మ పారుతున్నా చుక్క నీటిని వాడుకోకుండా సీఎం పైప్ లైన్ ద్వారా తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని తరలించుకుపోయేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత రైతాంగానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భూ నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం అమలు మేరకు రైతులకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
భూ నిర్వాసిత రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ హనుమంతు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోరం శివకుమార్రెడ్డి, వడ్ల మోనప్ప, ఉబేదుర్ రహిమాన్, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మరాజు గౌడ్, గోపాల్రెడ్డి, తరుణ్, షేక్ షమీ తదితరులు పాల్గొన్నారు.