PRLIS | నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : పాలమూరు ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) చేపట్టారు. ఉమ్మడి పాలమూరులో 10లక్షల ఎకరాలకు, రంగారెడ్డి, నల్లగొండలో 2.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకాన్ని ఈనెల 16న కొల్లాపూర్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో 6.51టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులో భాగంగా మొదటి లిఫ్టుగా అంజనగిరిని రూ.5వేల కోట్లతో నిర్మించారు. ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు శుద్ధజలం అందించడం జరుగుతోంది.
అలాంటి పథకానికి ప్రస్తుతం ఎంజీకేఎల్ఐలో భాగంగా నిర్మించిన ఎల్లూరు జలాశయం నుంచి నీటిని అందిస్తున్నారు. ఈ జలాశయం సామర్థ్యం కేవలం 0.35టీఎంసీలు కాగా, ఇకపై అంజనగిరి రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథకు నీళ్లు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.140కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మిషన్ భగీరథకు నీళ్లను అందించేందుకు ప్రత్యేకంగా పైపులైన్ పనులను చేపడుతున్నారు. దీనికోసం కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ జలాశయం హెడ్రెగ్యులేటరీ నుంచి 1.20కిలోమీటర్ల మేర భగీరథ పథకం ఇన్టేక్వెల్లోకి నీటిని తరలించడం జరుగుతుంది. పైపులైన్ వేసే పనులను చేపడుతున్నారు. అలాగే ప్రత్యేకంగా తూం కూడా అందుబాటులోకి రానున్నది.
డిసెంబర్ టార్గెట్..
డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ పూర్తిచేసేలా ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యం నిర్దేశించింది. దీంతో గడువులోగా పనులు పూర్తయ్యేలా ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు. కాగా వచ్చే వేసవి నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 16నుంచి నార్లాపూర్ పంపుహౌస్లో ఒక మోటర్తో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి మిషన్ భగీరథ పథకంలోని ఇన్టేక్వెల్ని నింపుతారు. దీనివల్ల మిషన్ భగీరథకు నీటి సమస్య తీరనుంది. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35టీఎంసీలే కాగా, నార్లాపూర్ ఏకంగా 6.51టీఎంసీలు కావడంతో తాగునీటి సమస్య ఇక పూర్తిగా కనుమరుగు కానున్నది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీళ్లు అందడంలో అప్పుడప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయి.
వర్షాభావ సమస్యలు ఏర్పడితే శ్రీశైలం బ్యాక్వాటర్లో నీళ్లు లేక మిషన్ భగీరథకు ఎండాకాలంలో తాగునీటి సమస్య ఏర్పడుతున్నది. దీనికోసం శ్రీశైలం బ్యాక్వాటర్ను రివర్స్ పంపింగ్ ద్వారా తిరిగి ఎత్తిపోస్తూ తాత్కాలికంగా మిషన్ భగీరథకు నీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. నార్లాపూర్ ద్వారా నీటి విడుదల ప్రారంభమైతే ఎప్పుడూ 2టీఎంసీల నీళ్లు రిజర్వుగా నీళ్లు ఉండనుండడంతో మిషన్ భగీరథకు నీటి లభ్యత పెరుగుతుంది. వేసవిలో రివర్స్ పంపింగ్ చేపట్టాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఎండాకాలంలో కూడా తాగునీటి సమస్యకు ఢోకా ఉండదు కాగా, పాలమూరు లిఫ్టు పథకం వల్ల సాగుతోపాటుగా మొదటి దశలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 70 మండలాల్లోని 1,226 గ్రామాలకు, హైదరాబాద్కు తాగునీటి సమస్య ఉండదు. రాబోయే దశాబ్దాల పాటు తాగునీటికి ప్రజలు తల్లడిల్లకుండా సీఎం చేసిన ఈ లిఫ్టు ఓవైపు సాగుకు, పరిశ్రమలకు నీటిని అందించడంతోపాటు మౌళిక వసతి కల్పనలో కీలకమైన తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెల్లుచీటీ ఇవ్వనున్నది. ఫలితంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన శుద్ధ జలం సరఫరా అవుతూనే ఉంటాయి.
పాలమూరు ఎత్తిపోతల పనుల్లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి మిషన్ భగీరథ ప్లాంట్కు నీటిని అందించే పనులు చేపడుతున్నాం. ఇందుకు ప్రభుత్వం రూ.140కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రత్యేకంగా పైపులైన్ పనులు చేపడుతున్నాం. వచ్చే వేసవి నాటికి ఈ పనులు పూర్తవుతాయి. ఎండాకాలంలో శ్రీశైలం నుంచి రివర్స్ పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మిషన్ భగీరథకు నీళ్లు పుష్కలంగా లభిస్తాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుంది.
– సుధాకర్సింగ్, మిషన్ భగీరథ ఈఈ, కొల్లాపూర్